Dailyhunt
అన్నదాతల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం

అన్నదాతల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం

Satyam NEWS 5 years ago

నివర్ తుఫాన్ తో రాష్ట్రంలో రైతాంగం కుదేలైందని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ముందస్తు హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాకు లేఖ విడుదల చేశారు.

ఆ లేఖలో తుపానుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని, దేశానికి అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తున్నారని రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. రైతన్నలకు భరోసా కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నఅన్నదాతను పలకరించేందుకు మంత్రులకు ఎమ్మెల్యేలకు తీరిక లేదని విమర్శించారు.

అధికార యంత్రాంగం సైతం యథా రాజా తథా ప్రజా అన్నచందంగా రైతుల పట్ల అధికార యంత్రాంగం సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నివర్ తుఫాను రాష్ట్రంలో 10 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

నివర్ తుఫాను ప్రభావంతో వ్యవసాయ, ఉద్యాన శాఖల పరిధిలో సుమారు 12,13,550 ఎకరాల్లో (4,91,316 హెక్టార్లలో) పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశారని వీటికి సుమారు రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ముందస్తు హెచ్చరి కలు లేకపోవడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందన్నారు. ముందస్తు హెచ్చరికలు చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉభయ గోదావరి, చిత్తూరు, కడప జిల్లాల్లో వరి కోత దశలో ఉందని, కోతకు వచ్చిన వరి పైరు నీట మునగడంతో పాటు నేలకొరగడంతో రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, వేరు శనగ, పొగాకు, చెరకు, కంది, చిరుధాన్యాలు పంటలు నీట మునిగాయన్నారు. దీంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నఅన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం పంటనష్టాన్నిత్వరితగతిన అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తడిసి దెబ్బతిన్నరంగు మారిన ధాన్యాన్నిఇతర పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.

ప్రత్యామ్నాయ సాగుకు ఎరువులు ఉచితంగా పంపిణీ చేసి రైతాంగాన్నిఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. వరుస వర్షాలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులు వ్యవసాయం చేసేందుకు సైతం నిరాసక్తి కనబరుస్తున్నారని ప్రభుత్వ ఆదుకోకుంటే వ్యవసాయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News