Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు

భారత్ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు

Satyam NEWS 4 days ago

ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) వైస్ చైర్మన్ శశాంక్, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సమావేశంలో భారత్ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు, పరిశ్రమల స్థాపన, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు.

ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీ తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రపంచ స్థాయి నగరాలను అధ్యయనం చేసి అదే స్థాయిలో డిజైన్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తయిన తరువాత మాత్రమే భూ కేటాయింపులు చేపట్టాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీలోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టుల కోసం 500 ఎకరాలను కేటాయించే అంశంపై కూడా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ క్లస్టర్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని, అవసరమైతే ప్రధాని నరేంద్రమోడీని కలిసి విజ్ఞప్తి చేయాలని సీఎం పేర్కొన్నారు.

జూన్ నెలలో ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్‌లో పరిశ్రమల స్థాపనకు శంకుస్థాపన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ కేటాయింపు జరిగిన వెంటనే పరిశ్రమల నిర్మాణ పనులు ప్రారంభించేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు.

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు "ఇన్వెస్ట్ తెలంగాణ" పేరుతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం ఆకర్షణీయమైన లోగో, వెబ్‌సైట్‌తో పాటు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేందుకు ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థను తీసుకురావాలని, గ్రూప్-1 స్థాయి అధికారులను ఈ బాధ్యతలకు నియమించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేయగల అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం పేర్కొన్నారు. 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలని, దాని నీటి అవసరాల కోసం ఎస్‌టీపీలు వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

జీసీసీలు, డేటా సెంటర్ల కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రహదారుల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల స్థాపనకు అనుకూలంగా ప్రత్యేక పాలసీ రూపొందించాలని తెలిపారు. అలాగే మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ టీ ఫైబర్‌కు అనుసంధానం కావాల్సిందేనని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News