ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
ముఖ్యoగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో 'ఏబోలా' వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ప్రత్యేక మార్గదర్శకాలు, సలహాలు, సూచనల ఆధారంగా 'ఎబోలా' వైరస్ వ్యాప్తి, కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిద్దంగా ఉందని మంత్రి ప్రకటించారు. ఆఫ్రికాలోని కాoగో, ఉగాండా దేశాల్లో ఎబోలా తీవ్రత రోజురోజుకీ పెరుగుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో సదరు దేశాల నుంచి రాష్ట్రంలోనికి వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకులను (ట్రావెల్ హిస్టరీ ఆధారంగా) వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసే విషయంలో ఎయిర్ పోర్ట్ అథార్టీ, సదరు జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నేడొక ప్రకటనలో తెలిపారు.
వైరస్ లక్షణాలు కలిగిన వారిని వెంటనే క్వారంటైన్ చేసి, పక్కనున్న వారికి కూడా వెంటనే వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. విశాఖ ఓడరేవు అధికారులతో కూడా మాట్లాడి, ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. విమానాల ద్వారా కాకుండా రోడ్డు మార్గాల ద్వారా వచ్చే వారి విషయంలోనూ అవసరమైన చర్యలు ఉంటాయన్నారు.
ఎబోలా వైరస్ పీడిత దేశాల నుంచి దేశంలోని వచ్చే ప్రయాణికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, ఇందుకు అనుగుణంగా అవసరమైన సమాచారాన్ని సదరు రాష్ట్రాలకు పంపుతోందని తెలిపారు. కొవిడ్ హయాంనాటి అనుభవాలు దృష్టిలో పెట్టుకుని 'ఏబోలా' విషయంలో ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలపై 'యాక్షన్ ప్లాన్' సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో ANM, Asha వర్కర్ల నుంచి స్థాయి నుoచి అందర్నీ 'వర్చువల్' సమావేశాల ద్వారా అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు.

