ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలి వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది. కొండాపూర్ సైబర్ మెడోస్ నివాసి, భారత వైమానిక దళ మాజీ కమాండర్, ప్రముఖ నిర్మాత వి.ఆర్.
కె. రావు మనవరాలు హిమశ్రీ వేమూరి, కైలాష్ గోగినేనిల వివాహ మహోత్సవం జన్వాడలోని నియో కన్వెన్షన్లో జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు.
గోగినేని శ్రీనివాసరావు- గోగినేని ప్రియాంక దంపతుల జ్యేష్ఠ పుత్రుడు కైలాష్ గోగినేని. వేమూరి అమరనాథ్-వేమూరి గీత దంపతుల జ్యేష్ఠ పుత్రిక హిమశ్రీ వేమూరి. వీరిద్దరి వివాహాన్ని వీఆర్కే రావు చాలా గ్రాండ్గా జరిపించారు. వీఆర్కే రావు కేవలం ఒక సైనికుడిగానే కాకుండా సమాజ సేవకుడిగా, కళాకారుడిగా ఎందరికో ఆదర్శం. 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా ఉత్తమ కమాండర్ అవార్డు అందుకున్న ఘనత ఆయనది.
రిటైర్మెంట్ తర్వాత అజైల్ గ్రూప్ ద్వారా ఏకంగా 32 వేల మందికి ఉపాధి కల్పించి నిరుద్యోగతపై యుద్ధం ప్రకటించారు. బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేసిన నిర్మాతగా రావు కి ప్రత్యేక గుర్తింపు ఉంది. వరకట్నం, అవినీతి వంటి సామాజిక రుగ్మతలపై ఆయన తీసిన సందేశాత్మక చిత్రాలు అనేక ప్రతిష్టాత్మక నంది అవార్డులను కొల్లగొట్టాయి.
శివాజీ రాజా హీరోగా తెరకెక్కిన 'మొగుడ్స్ పెళ్లామ్స్' చిత్రంతో నిర్మాతగా మరో నందిని అందుకుని అతి తక్కువ కాలంలోనే చిత్రసీమలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు. అజైల్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై ఆయన అందించిన సినిమాలు నేటికీ ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. సినీ పెద్దలు కేఎస్ రామారావు, శివాజీ రాజా, సాయికుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో సందడి చేశారు.
అశోక్ కుమార్, రాజీవ్ కనకాల, శివబాలాజీ-మధుమిత దంపతులు ఈ పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు అలీ, యాంకర్ శిల్పా చక్రవర్తి వంటి వారు హాజరై సందడి చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన కుటుంబంతో కలిసి రావడం విశేషం.
వివాహానికి ముందు నిర్వహించిన సంగీత్ ప్రోగ్రామ్ లో సినీ తారల ఆటపాటలు అతిథులను మంత్రముగ్ధులను చేశాయి. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు హాజరయ్యారు.

