Dailyhunt
హై స్పీడ్ రైల్‌ నెట్‌వర్క్‌ హబ్‌గా ఏపీ

హై స్పీడ్ రైల్‌ నెట్‌వర్క్‌ హబ్‌గా ఏపీ

Satyam NEWS 1 week ago

రైల్వే నెట్‌వర్క్‌లో ఏపీ సరికొత్త రికార్డులు సృష్టించబోతోంది. దేశంలో రాబోయే హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్ ప్రాజెక్టులో ఏపీ మేజర్‌ సెంటర్‌గా మారనుంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌లు రెడీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఏకంగా మూడు ప్రధాన కారిడార్లు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో మొదటి కారిడార్ హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి. ఈ కారిడార్ కోస్తా జిల్లాలకు వరం లాంటిది. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఏపీ రాజధాని అమరావతిని కలుపుతూ చెన్నై వరకు ఈ బుల్లెట్ రైలు వెళ్తుంది. దీనివల్ల గంటల తరబడి సాగే ప్రయాణం కేవలం నిమిషాల్లోనే ముగిసిపోతుంది. ఈ రూట్‌లో దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు స్టేషన్లతో పాటు తిరుపతి ఎయిర్‌పోర్ట్ దగ్గర కూడా రైలు ఆగుతుంది. తిరుపతి వెళ్లే భక్తులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

ఇక రెండో కారిడార్ రాయలసీమ మీదుగా బెంగళూరు - హైదరాబాద్ కనెక్టివిటీ. రాయలసీమ వాసులకు కూడా హై స్పీడ్ రైలు కల త్వరలోనే నిజం కానుంది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే రైలు కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, హిందూపురం స్టేషన్ల మీదుగా వెళ్తుంది. దీనివల్ల రాయలసీమ ప్రాంతం నుంచి ఐటీ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్‌లకు వెళ్లడం చాలా సులభం అవుతుంది. వ్యాపారాలు చేసే వారికి, విద్యార్థులకు ఇది పెద్ద ప్లస్ పాయింట్.

ఇక మూడో కారిడార్ చిత్తూరు మీదుగా మరో వెళ్లే కారిడార్. మైసూర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నై వెళ్లే మరో హై స్పీడ్ రైలు మార్గం కూడా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు మీదుగా వెళ్తుంది. అంటే..రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాలకు ఈ సూపర్ ఫాస్ట్ రైలు సౌకర్యం అందనుంది.

ఈ 3 కారిడార్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలోనే కాదు..ఆర్థికంగా కూడా దూసుకుపోతుంది. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలను ఇక నిమిషాల్లో చేరుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News