పీఏసీ (పొలిటికల్ అఫైర్స్ కమిటీ) సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ప్రతి వారం ఒక రోజు మంత్రులకు ప్రభుత్వ పనుల నుంచి విరామం ఇచ్చి, పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.
పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, తనతో సహా మంత్రులంతా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుల ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ నాయకులు చేపడుతున్న పనులపై ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాలు శిరోధార్యమని, అందరూ పీసీసీ అధ్యక్షుల మార్గదర్శకాలను అనుసరించాల్సిందేనని తేల్చి చెప్పారు. తాను కూడా వారానికి ఒకసారి ఏదో ఒక నియోజకవర్గంలో పార్టీ పనుల్లో పాల్గొంటానని, పీసీసీ అధ్యక్షులు ఏ నియోజకవర్గాన్ని కేటాయిస్తే అక్కడికే వెళ్తానని ప్రకటించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లు, సీనియర్ నాయకులు ప్రతి వారం ఒక నియోజకవర్గానికి వెళ్లి పార్టీ బలోపేతం కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఎవరు ఏ నియోజకవర్గానికి వెళ్లాలనేది పార్టీ అధ్యక్షులే నిర్ణయిస్తారు. ఈ మేరకు రేపటి నుంచే మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర కీలక నాయకులకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గాలను కేటాయించనున్నారు.

