పశ్చిమ బెంగాల్ లో స్పష్టమైన ఆధిక్యత సాధించిన బీజేపీ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికల పరంగా దాదాపు శూన్య స్థాయిలో ఉన్న బీజేపీ, ఇప్పుడు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను గద్దె దించడంలో కీలక ముందడుగు వేసింది.
ఇప్పటివరకు ఉత్తర బెంగాల్లోని జల్పాయిగురి, కూచ్ బీహార్ వంటి ప్రాంతాల్లో మాత్రమే బలంగా ఉన్న బీజేపీ, ఈసారి దక్షిణ బెంగాల్లోని ప్రెసిడెన్సీ డివిజన్ వరకు తన ప్రభావాన్ని విస్తరించింది. ఇది తృణమూల్కు కట్టుబడి ఉన్న ప్రాంతాల్లో కూడా ఓటర్ల మద్దతు మారుతున్న సంకేతంగా భావిస్తున్నారు. 2009 లోక్సభ ఎన్నికల వరకు బెంగాల్లో ఒక్క స్థానమూ లేకపోయిన బీజేపీ, కేవలం 4 శాతం ఓటు శాతంతో పరిమితమైంది.
అయితే నరేంద్రమోడీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ స్థితి గణనీయంగా మారింది. అదే ఏడాది రెండు లోక్సభ స్థానాలు, 17 శాతం ఓటు శాతం సాధించిన బీజేపీ, 2019లో 42లో 18 స్థానాలు గెలిచి 40 శాతం పైగా ఓట్లు సాధించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలు, 44 శాతం ఓటు శాతం సాధించిన బీజేపీ, ఇప్పుడు పూర్తి స్థాయి అధికారానికి దగ్గరపడటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.
ఈ పరిణామం తూర్పు భారతదేశంలో బీజేపీ విస్తరణకు కీలక మైలురాయిగా భావిస్తున్నారు. మధ్యాహ్నం వరకు లభించిన ట్రెండ్స్ ప్రకారం బీజేపీ సుమారు 192 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఈ స్థాయి విజయాన్ని కేవలం ఓటరు జాబితా సవరణల వల్లనే సాధించిందని చెప్పడం కష్టం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాలు, ప్రాంతాల నుంచి బీజేపీకి మద్దతు లభించినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విజయాన్ని బీజేపీ నేతలు కేవలం ఎన్నికల ఫలితంగా కాకుండా, దశాబ్దాలుగా ఉన్న ఆశయ సాధనగా పేర్కొంటున్నారు. జనసంఘ్ స్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఇది నివాళిగా భావిస్తున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

