Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పశ్చిమాసియా ఉద్రిక్తతలు వాంఛనీయం కాదు

పశ్చిమాసియా ఉద్రిక్తతలు వాంఛనీయం కాదు

Satyam NEWS 1 week ago

శ్చిమ ఆసియా లో కొనసాగుతున్న యుద్ధం అవాంఛనీయమని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో నేడు ఆయన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గల్ఫ్ దేశంపై జరిగిన ఈ తరహా దాడులు "అంగీకారయోగ్యం కావు" అని ప్రధాని స్పష్టం చేశారు.

ప్రస్తుత పశ్చిమ ఆసియా ఉద్రిక్త పరిస్థితులను అత్యంత సంయమనంతో ఎదుర్కొంటున్న యూఏఈ వైఖరిని మోదీ ప్రశంసించారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం పునరుద్ధరణ కోసం అవసరమైన అన్ని విధాల సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ హామీ ఇచ్చారు.

ప్రధాని మోదీ యూఏఈ పర్యటనలో రక్షణ, ఇంధనం, మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్ రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్-యూఏఈ మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో ద్వైపాక్షిక భద్రతా, రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది.

ఇంధన రంగంలో కూడా రెండు దేశాలు కీలక అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై అవగాహన ఒప్పందంతో పాటు ద్రవీభవించిన పెట్రోలియం వాయువు (ఎల్పీజీ) సరఫరాలకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. సముద్ర రంగంలో వడినార్‌లో షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదిరింది.

భారత్ లో మౌలిక సదుపాయాల వృద్ధికి యూఏఈ పెట్టుబడి

భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అలాగే RBL Bank మరియు Samman Capitalలో పెట్టుబడుల రూపంలో మొత్తం 5 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించారు. ఈ పెట్టుబడులు భారత్-యూఏఈ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించనున్నాయి.

అబుదాబికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆయనకు గౌరవ వందనం నిర్వహించారు. అనంతరం యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు.

మే 15 నుంచి 20 వరకు కొనసాగనున్న ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ యూఏఈ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో ఆయన నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలను కూడా సందర్శించనున్నారు. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, ఆవిష్కరణలు, గ్రీన్ గ్రోత్ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది.

యూఏఈ తర్వాత ప్రధాని మోదీ మే 15-17 మధ్య నెదర్లాండ్స్‌లో పర్యటించనున్నారు. అక్కడ డచ్ ప్రధాని రాబ్ జట్టిన్ తో చర్చలు జరపనున్నారు. అలాగే నెదర్లాండ్స్ రాజు విలియమ్ అలెగ్జాండర్ మరియు రాణి మాక్సిమాలను కలుసుకోనున్నారు. సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, నీటి నిర్వహణ, రక్షణ, ఆవిష్కరణలపై చర్చలు జరగనున్నాయి.

మే 17-18 తేదీల్లో స్వీడన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, స్వీడన్ ప్రధానితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. అలాగే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలితో కలిసి యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, గ్రీన్ ట్రాన్సిషన్, సరఫరా గొలుసుల బలోపేతంపై చర్చలు జరగనున్నాయి.

నార్వేలో మే 19న జరగనున్న మూడో ఇండియా-నార్డిక్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఓస్లోలో నార్వే ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సదస్సులో డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, స్వీడన్ దేశాల నాయకులు కూడా పాల్గొననున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News