అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ముడి చమురు సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ₹3 నుండి ₹3.29 వరకు పెరిగాయి. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం 90% పైగా దిగుమతుల పైనే ఆధారపడుతుండటంతో ఈ భారం తప్పలేదు.
అయితే, దేశమంతటా ఒకే రకమైన పెంపు ఉన్నప్పటికీ.. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర లీటరుకు దాదాపు ₹113, డీజిల్ ₹101 మార్కును దాటి దేశంలోనే అత్యధిక ధరలు ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.
దీనిని సాకుగా చూపిస్తూ ప్రతిపక్ష వైసీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. కానీ అసలు నిజం ఏమిటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంధనంపై ఏమైనా కొత్త పన్నులు వేసిందా? అంటే 'లేదు' అనేదే సమాధానం. మరి ఏపీలోనే రేట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? దీని వెనుక ఉన్న అసలు 'పాపం' ఎవరిది? ఒకసారి గణాంకాల్లోకి వెళ్తే అసలు దొంగ ఎవరో తేలిపోతుంది.
2019 మే నాటికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి ఏపీలో పెట్రోల్ ధర ₹76, డీజిల్ ధర ₹68 గా ఉండేవి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇవి ఎక్కువేమీ కావు. పైగా 2018లో కేంద్రం ధరలు పెంచినప్పుడు, నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ లీటరుకు ₹2 తగ్గించి ఊరటనిచ్చింది.
2024 జూన్ నాటి పరిస్థితి అంటే జగన్ ఐదేళ్ల పాలన ముగించుకుని దిగిపోయే సరికి ఏపీలో పెట్రోల్ ధర ₹110, డీజిల్ ₹99 కి చేరింది. అంటే ఈ ఐదేళ్ల మధ్య కాలంలోనే ఏపీలో ఇంధన ధరలు ఇతర రాష్ట్రాల కంటే విపరీతంగా పెరిగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో సంబంధం లేకుండా, ప్రజలపై రకరకాల సెస్సులు, అదనపు వ్యాట్ (VAT) రూపంలో ఇంధన ధరలను అడ్డగోలుగా పెంచేసింది.
జగన్ హయాంలో జరిగిన ఇంధన దోపిడీ
జులై 2020: ఒక్కో లీటర్ పెట్రోల్, డీజిల్పై ఏకంగా ₹4 అదనపు వ్యాట్ పెంపు
సెప్టెంబరు 2020: రోడ్ల అభివృద్ధి పేరుతో ₹1 రోడ్డు డెవలప్మెంట్ సెస్ విధింపు (కానీ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే)
ఫిబ్రవరి 2020: పెట్రోలుపై ₹2.76, డీజిల్పై ₹3.07 చొప్పున వ్యాట్ పెంపు. దీనితో పెట్రోల్పై 31%, డీజిల్పై 22.5% భారీ వ్యాట్ నమోదైంది.
కోవిడ్ కాలంలో నిర్వాకం: కరోనా సంక్షోభ సమయంలో కేంద్రం ఇంధన ధరలు తగ్గించినా, ఇతర రాష్ట్రాలు ప్రజలపై భారం తగ్గించినా.. జగన్ ప్రభుత్వం మాత్రం రూపాయి కూడా తగ్గించకుండా మొండిగా వ్యవహరించింది.
దీని ఫలితంగానే వైసీపీ పాలనలో మొదటి రెండేళ్లలోనే పెట్రోల్ ఏకంగా ₹41, డీజిల్ ₹31 పెరిగి సామాన్యుడి నడుం విరిచింది.
కూటమి ప్రభుత్వ సంయమనం - నేటి నిజాలు
రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇంధనంపై ఎలాంటి అదనపు పన్నులు లేదా కొత్త సెస్సులు విధించలేదు.
జూన్ 2024 (కూటమి వచ్చేనాటికి) పెట్రోలు ₹110 డీజిలు ₹99
మే 2026 (ప్రస్తుతం) పెట్రోలు ₹113 డీజిల్ ₹101
అంతర్జాతీయ యుద్ధ సంక్షోభం వల్ల కేంద్రం/ఆయిల్ కంపెనీలు పెంచిన ₹3 తప్ప, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఒక్క పైసా కూడా భారం మోపలేదు.
దొంగే దొంగా అన్నట్టు వైసీపీ విమర్శలు!
గత ప్రభుత్వ హయాంలో ఇంధనంపై విధించిన అడ్డగోలు పన్నులు, సెస్సుల వల్లే నేడు ఏపీలో బేస్ ప్రైస్ (మౌలిక ధర) దేశంలోనే అత్యధికంగా ఉంది. జగన్ రెడ్డి వేసిన ఆ పన్నుల భారాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా తగ్గించాలన్నా, రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వెళ్లిన ప్రస్తుత పరిస్థితుల్లో అది మరింత ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది.
తమ పాలనలో లీటరుకు ₹40 వరకు రేట్లు పెంచి, రాష్ట్రాన్ని దేశంలోనే అత్యధిక ధరల స్థానంలో నిలబెట్టిన పుణ్యాత్ముడు జగన్ మోహన్ రెడ్డి. ఇదంతా దాచేసి, ఇప్పుడు అంతర్జాతీయ కారణాలతో పెరిగిన ₹3 రేటును పట్టుకుని కూటమి ప్రభుత్వంపై వైసీపీ గుండెలు బాదుకోవడం చూస్తుంటే 'దొంగే దొంగా అన్నట్టు' ఉంది. ఏపీలో నేటి పెట్రోల్ మంటలు ఖచ్చితంగా నాటి జగన్ పాలన తెచ్చిన శాపాలే అని సామాన్య జనం సైతం ముక్తకంఠంతో చెప్తున్నారు.

