Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాయలసీమ రూపురేఖలు మారుస్తున్న కూటమి ప్రభుత్వం

రాయలసీమ రూపురేఖలు మారుస్తున్న కూటమి ప్రభుత్వం

Satyam NEWS 4 days ago

రాయలసీమ ప్రాంత అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి పాలనతో ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన రాయలసీమ ఇప్పుడు అభివృద్ధి దిశగా కొత్త అడుగులు వేస్తోందన్నారు.

రాయలసీమ సమీకృత ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే ప్రముఖ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.

రాయలసీమలో హార్టికల్చర్ రంగానికి అపార అవకాశాలు ఉన్నాయని గుర్తించిన సీఎం చంద్రబాబు, రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పండ్ల తోటలు, కూరగాయల సాగు, సుగంధ ద్రవ్య పంటలు, డ్రిప్ ఇరిగేషన్, కోల్డ్ స్టోరేజ్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఈ ప్రాంత ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పు రానుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 8.41 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు జరుగుతుండగా, 2030 నాటికి దాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇందులో భాగంగానే రాయలసీమ సమీకృత ఉద్యాన అభివృద్ధి ప్రణాళికకు రూపకల్పన చేసి, అమలుకు ఉత్తర్వులు జారీ చేయడం ప్రాంత అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు.

గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నీటి వనరుల సమర్థ వినియోగం, మార్కెటింగ్ సదుపాయాలు, ఎగుమతులకు అనుకూల విధానాలతో రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

రాయలసీమలో హార్టికల్చర్ రంగ అభివృద్ధితో రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. "రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. రాయలసీమ అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది" అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News