పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నగరంలో సామాన్య ప్రయాణికుడిలా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రోటోకాల్స్ కు భిన్నంగా ఆయన అత్యంత సాదాసీదాగా మెట్రో ఎక్కారు.
నగరంలోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం ఆయన ఎర్రమంజిల్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో వెళ్లారు.
స్టేషన్ కు చేరుకున్న మంత్రి స్వయంగా టికెట్ తీసుకుని ప్లాట్ఫాంపైకి వెళ్లారు. రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, మంత్రి సీటు కోసం ప్రయత్నించకుండా తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే ప్రయాణించారు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. మెట్రో ప్రయాణంలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
మంత్రిని తమ మధ్య చూసిన ప్రయాణికులు తొలుత ఆశ్చర్యపోయినా, ఆయన పలకరింపుతో ఉత్సాహంగా మాట్లాడారు. పలువురు ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా, మంత్రి ఎంతో ఓపికగా వారితో ఫొటోలు దిగారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి మెట్రో ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు.

