Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తాటి ఈత వనాలు దగ్ధం కాకుండా మనమే చూసుకోవాలి

తాటి ఈత వనాలు దగ్ధం కాకుండా మనమే చూసుకోవాలి

Satyam NEWS 10 hrs ago

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, నిప్పు రవ్వల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఈత, తాటి వనాలు దగ్ధమవుతున్న నేపథ్యంలో గౌడ సోదరులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈత, తాటి చెట్లు గీతా కార్మికుల జీవనాధారమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల్లో జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామం, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు ప్రాంతాల్లో ఈత వనాలు పూర్తిగా దగ్ధమై గౌడ కుటుంబాలకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు.

అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఈత, తాటి చెట్ల కింద ఎండిపోయిన ఆకులు, చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి సూచించారు. గ్రామ స్థాయిలో గీతా కార్మికులు కలిసి చెట్ల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని, చెట్లకు నీరు పట్టడం, ఎండు చెత్త తొలగించడం వంటి చర్యలు తీసుకుంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు.

అలాగే ఈత, తాటి వనాల సమీపంలో బీడీలు, సిగరెట్లు కాల్చకుండా జాగ్రత్తలు పాటించాలని, ఎవరూ నిర్లక్ష్యంగా నిప్పు వేయకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా మంటలు కనిపించిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎక్సైజ్ అధికారులకు సూచించినట్లు మంత్రి తెలిపారు. ఈత, తాటి వనాలను కాపాడుకోవడం ద్వారా గౌడ కుటుంబాల జీవనోపాధిని రక్షించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News