టీఆర్ఎస్ పార్టీ పేరుకు బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘంపై వత్తిడి తెచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కవితకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది.
ఈనెల 25న మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించారు. ఆ సందర్భంగా పార్టీ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా ఆమె సంక్షిప్తంగా వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం "తెలంగాణ రక్షణ సేన" అనే పేరుకు కూడా ఆమోదముద్ర వేసింది. ఈ పేరు కూడా పార్టీ నిర్మాణంలో కీలకంగా ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. రెండు పేర్లకు సంబంధించి అధికారిక అనుమతి లేఖను ఎన్నికల సంఘం అధికారులు అందజేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత నివాసానికి వెళ్లిన అధికారులు పార్టీకి సంబంధించిన అనుమతి పత్రాన్ని అందించినట్టు సమాచారం. పార్టీ గుర్తింపు, గుర్తు, భవిష్యత్ ఎన్నికల్లో పోటీకి సంబంధించిన ప్రక్రియలు త్వరలో పూర్తి చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. ముఖ్యంగా టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ శక్తి ముందుకు రావడం, ప్రస్తుత రాజకీయ పార్టీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

