అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా పర్యటనకు ముహూర్తం పెట్టుకున్నారు.
పుతిన్ మే 19-20 తేదీల్లో చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు క్రెంలిన్ అధికారికంగా ప్రకటించింది.
ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో పుతిన్ కీలక ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగించుకుని వెళ్లిన కొద్ది రోజులకే పుతిన్ చైనా పర్యటన ఖరారవడం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
క్రెంలిన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రష్యా-చైనా సంబంధాల మరింత బలోపేతం, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక సహకారం, రక్షణ రంగ సమన్వయం వంటి అంశాలపై ఇరు దేశాధినేతలు విస్తృతంగా చర్చించనున్నారు. అంతేకాకుండా ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, ప్రాంతీయ భద్రతా సవాళ్లు, ఉక్రెయిన్ యుద్ధం, తైవాన్ సమస్య, ఇరాన్ ఉద్రిక్తతలపై కూడా అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఈ సమావేశంలో రష్యా-చైనా మధ్య 25 సంవత్సరాల క్రితం కుదిరిన "ట్రీటీ ఆఫ్ గుడ్-నెయిబర్లినెస్ అండ్ ఫ్రెండ్లీ కోఆపరేషన్" ఒప్పందానికి గుర్తుగా సంయుక్త ప్రకటనపై సంతకాలు చేసే అవకాశముందని సమాచారం. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారానికి కీలక పునాదిగా భావిస్తున్నారు.
అమెరికా-చైనా సంబంధాలు ఇటీవల కొత్త మలుపు తిరుగుతున్న వేళ, ట్రంప్-షీ భేటీ అనంతరం వెంటనే పుతిన్ చైనా పర్యటన జరగడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల ఒత్తిడికి ఎదురుగా మాస్కో-బీజింగ్ మధ్య సమన్వయం మరింత పెరుగుతోందనే సంకేతాలను ఈ పర్యటన ఇస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు కొనసాగిస్తుండగా, చైనా మాత్రం రష్యాతో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తోంది. మరోవైపు తైవాన్ అంశంలో అమెరికా జోక్యంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా-చైనా నేతల సమావేశం భవిష్యత్తు అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని భావిస్తున్నారు.

