ఇంధన పొదుపు కోసం వారంలో ఒక రోజు ' నో వెహికల్ డే' అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారధి కేబినెట్లో ముఖ్యమంత్రి చేసిన ఈ సూచనలను వెల్లడించారు.
వారంలో ఒకరోజు "నో వెహికల్ డే" పాటించాలని, అవసరమైతే ఇంటి నుంచే పని చేసే విధానాన్ని అమలు చేయాలని, పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో ఆన్లైన్ తరగతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. ప్రభుత్వ కాన్వాయ్ల పరిమాణాన్ని తగ్గించడం, ప్రత్యేక విమానాల వినియోగాన్ని పరిమితం చేయడం, విదేశీ పర్యటనలను కొంతకాలం వాయిదా వేయడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు చెప్పారు.
అదేవిధంగా ప్రజలు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించాలని, అధికారిక సమావేశాలను వీలైనంత వరకు వర్చువల్ విధానంలో నిర్వహించాలని సూచించారు. ఇంధన వినియోగంపై కఠిన పర్యవేక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. బంగారం కొనుగోళ్లను కూడా కొంతకాలం వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశ ప్రజలకు మితవ్యయ జీవనశైలిని అవలంబించాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం, విదేశీ ప్రయాణాలు మరియు బంగారం కొనుగోళ్లను తగ్గించడం ద్వారా దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. అదే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రజలకు సూచనలు చేస్తూ దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతోంది.

