Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆన్‌లైన్.. ఆఫ్‌లైన్.. ఏదైనా టీడీపీ క్యాడర్‌కు  మహానాడు ఒక ఎమోషన్ !

ఆన్‌లైన్.. ఆఫ్‌లైన్.. ఏదైనా టీడీపీ క్యాడర్‌కు మహానాడు ఒక ఎమోషన్ !

Telugu 360 1 week ago

తెలుగుదేశం పార్టీ చరిత్రలో మహానాడుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పసుపు పండుగగా పిలుచుకునే ఈ వేడుక కోసం రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు తరలివచ్చి, తమ నాయకుడి మాటలను ప్రత్యక్షంగా వింటూ ఉత్తేజం పొందుతారు.

గతంలో కరోనా సమయంలో అనివార్యంగా వర్చువల్ విధానంలో నిర్వహించినప్పటికీ, కార్యకర్తలు అదే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు 2026లో మరోసారి నెల్లూరు నుంచి మంగళగిరికి వేదిక మారుస్తూ, హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని అధిష్టానం తీసుకున్న నిర్ణయం కార్యకర్తలకు కొంత నిరాశ కలిగించింది.

క్షేత్రస్థాయిలో ఫీల్ లేకపోయినా.. ఎమోషనల్ కనెక్షన్ మామూలే

పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక నేతల మధ్య జరిగే చర్చలు, తీర్మానాలు డిజిటల్ స్క్రీన్ల ద్వారా చూసినప్పుడు.. ప్రత్యక్షంగా పాల్గొన్నంత సంతృప్తి ఉండదు. ఆ భోజనాలు, ఆ హడావుడి, ఆత్మీయ పలకరింపులు మిస్ అవుతున్నామన్న భావన కార్యకర్తల్లో ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ, దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన పొదుపు చర్యలకు సంఘీభావంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆడంబరాల కంటే పార్టీ విధివిధానాలు, భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసుకోవడమే ముఖ్యమని చంద్రబాబు నాయుడు భావించడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం.

వాయిదా వేయని సంప్రదాయం

పరిస్థితులు అనుకూలించలేదని మహానాడును వాయిదా వేసే సంస్కృతి టీడీపీలో లేదు. ఆపదలో ఉన్నా, అధికారంలో ఉన్నా నిర్ణీత సమయంలోనే ఈ సమావేశాలను నిర్వహించడం ద్వారా పార్టీ తన కేడర్‌కు భరోసా ఇస్తుంది. పార్టీ విధివిధానాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తీర్మానాలు చేయడం మహానాడు ప్రత్యేకత. ఈ చిత్తశుద్ధే తెలుగుదేశం పార్టీని దశాబ్దాలుగా బలంగా నిలబెడుతోంది. వ్యవస్థాగత నిర్మాణం ఎంత బలంగా ఉంటుందో ఈ హైబ్రిడ్ మహానాడు మరోసారి నిరూపించబోతోంది.

డిజిటల్ వేదికపై పసుపు సైన్యం

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,848 క్లస్టర్ల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు వర్చువల్ ద్వారా ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. భౌతికంగా దగ్గర లేకపోయినా, భావజాలపరంగా అందరినీ ఏకం చేయడమే ఈ మహానాడు లక్ష్యం. కేవలం పబ్లిసిటీ కోసం కాకుండా, పార్టీ అంతర్గత బలాన్ని పెంచుకోవడానికి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి ఈ వేదికను వాడుకుంటున్నారు. వేదిక మారినా, విధానం మారినా.. మహానాడు స్ఫూర్తి మాత్రం అణుమాత్రం తగ్గదని టీడీపీ శ్రేణులు చాటిచెబుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360