అమరావతి రాజధాని నిర్మాణ వ్యయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలను చెప్పుకోవడానికి ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదు.
సచివాలయం, ఐకానిక్ భవనాల గ్లాస్ క్లాడింగ్ కోసం సుమారు రూ. 2,540 కోట్లు కేటాయించడంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న అరకొర సమాచార విధానం కూడా ఒక కారణం.
వివరాల లీకులు.. తప్పుడు ప్రచారానికి ద్వారాలు!
అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు వంటి ఐకానిక్ భవనాల కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఇటీవల క్యాబినెట్ భేటీలో గ్లాస్ క్లాడింగ్, అట్రియం, ఫోటోవోల్టాయిక్ ప్యానెల్స్ వంటి పనుల కోసం రూ. 2,540 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చారు. అయితే, ప్రభుత్వం ఈ ఖర్చుల వెనుక ఉన్న సాంకేతిక కారణాలను ప్రజలకు వివరించడంలో విఫలమవుతోంది. కేవలం అద్దాల కోసం వేల కోట్లు అనే ముక్క ముక్కల సమాచారం బయటకు రావడం వల్ల, దానిని విలాసం గా , దుబారాగా చిత్రీకరించే అవకాశం వైసీపీకి లభిస్తోంది.
ఐకానిక్ నిర్మాణాలు - ఖర్చు వెనుక ఉన్న వాస్తవాలు
ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తున్నప్పుడు, అక్కడి భవనాలు ఐకానిక్ హోదాను కలిగి ఉండాలి. ఈ భవనాలకు వాడే గ్లాస్ కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు. అవి అత్యాధునిక ఎనర్జీ ఎఫిషియంట్ గ్లాస్. సూర్యరశ్మి నుంచి వచ్చే వేడిని తగ్గించి, ఏసీ ఖర్చును ఆదా చేసేలా, అలాగే విద్యుత్ ఉత్పత్తి చేసే ఫోటోవోల్టాయిక్ సామర్థ్యం కలిగినవి. ఈ అద్దాల నాణ్యత, వాటి మన్నిక , భవన వైశిష్ట్యం గురించి ప్రభుత్వం సమగ్రంగా ప్రచారం చేయాలి. ఆ వివరాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పకుండా, అరకొర లీకులు ఇవ్వడం వల్ల సామాన్య ప్రజల్లో మామూలు అద్దాలకే ఇన్ని వేల కోట్లా అనే సందేహం కలగడం సహజం.
వైసీపీ విమర్శల పర్వం - సోషల్ మీడియా దాడులు
ఈ అవకాశాన్ని వైసీపీ నేతలు గట్టిగా వాడుకుంటున్నారు. అమరావతిని ఒక భ్రమగా, ధన దాహం ఉన్న ప్రాజెక్టుగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్లాస్ క్లాడింగ్ ఖర్చును ఇతర సంక్షేమ పథకాలతో పోలుస్తూ ప్రజల్లో అసహనం కలిగించేలా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. ఒకప్పుడు అమరావతి నిర్మాణ వ్యయంపై పవన్ కళ్యాణ్ సైతం గతంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలను గుర్తు చేస్తూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఖర్చును వారు టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి సరైన వివరణ లేకపోవడమే ఈ ప్రచారం వైరల్ కావడానికి ప్రధాన కారణం.
ప్రభుత్వ వైఖరి మారాలి: పారదర్శకత ఒక్కటే పరిష్కారం!
అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలంటే ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకోవాలి. ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి అరకొర లీకులు ఇవ్వడం ఆపి, ఒకేసారి సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలి. ఐకానిక్ భవనాల ఖర్చు ఎందుకు అంత ఎక్కువగా ఉందో, భవిష్యత్తులో ఆ నిర్మాణాలు ఏపీకి ఎలాంటి గౌరవాన్ని తెస్తాయో ప్రజలకు వివరించాలి. ఖర్చుపై గోప్యత లేదా స్పష్టత లేని ప్రకటనలు ప్రతిపక్షానికి రాజకీయ అస్త్రాలుగా మారుతాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి.

