సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ ప్రచారం మరోసారి ఊపందుకుంది. నవంబర్ 10న గ్రీస్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోందంటూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి.
కావ్యా మారన్, అనిరుధ్ రవిచందర్ మధ్య రిలేషన్షిప్ ఉందంటూ గత ఏడాది నుంచే గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి కనిపించారనే ప్రచారం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు కావ్యా మారన్ కానీ, అనిరుధ్ కానీ అధికారికంగా స్పందించలేదు.
అయితే ఈ ఏడాది జూన్లో అనిరుధ్ మేనమామ, నటుడు వై.జి. మహేంద్ర చేసిన వ్యాఖ్యలు ఈ పెళ్లి ప్రచారానికి మరింత హైప్ తీసుకొచ్చాయి. వీరి పెళ్లి జరగడం ఖాయమే అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
దీంతో కావ్యా-అనిరుధ్ పెళ్లిపై మళ్లీ చర్చ మొదలైంది. తాజాగా నవంబర్ 10, గ్రీస్ అంటూ డేట్, వెన్యూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ తేదీకి సంబంధించి కావ్యా మారన్ లేదా అనిరుధ్ కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ప్రస్తుతం ఇది కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంగానే చూడాలి.
అసలు ఈ గాసిప్ మొదటిసారి వైరల్ అయినప్పుడు అనిరుధ్ స్వయంగా స్పందించాడు. ''చిల్ అవుట్ గైస్.. రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఆపండి'' అంటూ తనదైన స్టైల్లో క్లారిటీ ఇచ్చాడు.
అయితే ఆ తర్వాత కూడా ఈ రూమర్స్ ఆగలేదు. తాజాగా కుటుంబ సభ్యుడి వ్యాఖ్యలు రావడంతో పాటు కొత్తగా పెళ్లి తేదీ, డెస్టినేషన్ వంటి వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కావ్యా మారన్-అనిరుధ్ పెళ్లి వార్తకు అధికారిక ధృవీకరణ లేదు. నవంబర్ 10న గ్రీస్లో పెళ్లి జరుగుతుందన్న ప్రచారం నిజమా? లేక మరో సోషల్ మీడియా గాసిప్పా? అనేది క్లారిటీ రావాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

