తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభించిన దళపతి విజయ్ ముందు ఇప్పుడు ఒక ధర్మసంకటం నిలిచింది. ఒకవైపు అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం, మరోవైపు తాను చెబుతున్న రాజకీయ విలువల ను కాపాడుకోవడం..
ఈ రెండింటి మధ్య ఆయన ప్రయాణం ఇప్పుడు సవాలుగా మారింది. అన్నాడీఎంకేకు చెందిన సుమారు 25 మంది ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిస్వామి జారీ చేసిన విప్ను ధిక్కరించి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే, ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఒక పార్టీలో చీలిక రావాలంటే కనీసం మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అన్నాడీఎంకేకున్న 47 మంది సభ్యుల్లో 32 మంది ఉంటేనే అది చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతానికి రెబల్స్ సంఖ్య 25 వద్ద ఆగిపోవడంతో, చట్టపరంగా వారిపై అనర్హత వేటు వేయాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంది.
రాజకీయ విలువలకు పరీక్ష
సినిమాల్లోనూ, పార్టీ ఆవిర్భావ సభలోనూ విజయ్ అవినీతి రహిత, విలువల రాజకీయం గురించి గొప్పగా మాట్లాడారు. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే మెజారిటీని నిలబెట్టుకోవడానికి అన్నాడీఎంకే రెబల్స్ను చేరదీయడం ఆయన క్లీన్ ఇమేజ్ను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇతర పార్టీల్లాగే విజయ్ కూడా ఫిరాయింపుల ను ప్రోత్సహిస్తే, ద్రవిడ పార్టీలకు ఆయనకు తేడా ఏముంటుందనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. పాత తరం రాజకీయ నాయకుల బాటలోనే ఆయన కూడా అధికార దాహం తో ముందుకు వెళ్తున్నారనే ముద్ర పడితే, అది దీర్ఘకాలంలో ఆయన పలుకుబడిని తగ్గించే ప్రమాదం ఉంది.
చట్టపరమైన చిక్కులు
ప్రస్తుత స్పీకర్ జె.సి.డి ప్రభాకర్ ఈ రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్య తీసుకుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ స్పీకర్ విచారణ పేరుతో కాలయాపన చేసినా లేదా వారిని అనర్హులుగా ప్రకటించకపోయినా, అది విజయ్ ప్రభుత్వానికి నైతిక ఓటమిగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే అన్నాడీఎంకే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. చట్ట ప్రకారం మూడో వంతు సభ్యులు విడిపోలేదు కాబట్టి, వారిపై కచ్చితంగా వేటు పడాలి. ఒకవేళ విజయ్ వారిని తన పార్టీలో విలీనం చేసుకుంటే, అది జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీస్తుంది.
విశ్వసనీయతకు భంగం?
తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుని విజయ్కు మద్దతు ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం శుభపరిణామం కాదు. అన్నాడీఎంకే రెబల్స్ మద్దతుతో పదవిని నిలబెట్టుకోవడం కంటే, నిబద్ధతతో కూడిన పాలన అందించడం ముఖ్యమని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అన్నాడీఎంకే రెబల్స్ను పక్కన పెట్టి, సంఖ్యా బలం లేకపోయినా నైతిక పోరాటం చేసి ఉంటే ఆయన గ్రాఫ్ ఎక్కడికో వెళ్లేది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తే, ఆయన కూడా మరో సాధారణ రాజకీయ నేత గానే మిగిలిపోతారనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

