ఈ వేసవిలో సరైన సినిమా రాలేదు. సంక్రాంతి తరవాత బాక్సాఫీసు కళకళలాడలేదు. ఆ లోటు `పెద్ది` తీరుస్తుందన్నది అందరి నమ్మకం. 'పెద్ది' తో మళ్లీ టాలీవుడ్ కి హుషారు వస్తుందని అంతా భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 'పెద్ది' ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం. కాకపోతే.. నిర్మాతల టార్గెట్ ఇది కాదు. పాన్ ఇండియా స్థాయిలో బజ్ ఏర్పడాలి. ఇండియా వైడ్ గా భారీ వసూళ్లు అందుకోవాలి. అప్పుడు గానీ 'పెద్ది' కి పెట్టిన బడ్జెట్లు వర్కవుట్ కావు. పాన్ ఇండియా సినిమా అని పోస్టర్ పై వేసుకొంటే సరిపోవడం లేదు. దానికి తగ్గ… ప్రచారం చేయాలి. ఈ విషయంలో పెద్ది రైట్ వేలోనే వెళ్తోందనిపిస్తోంది. పాన్ ఇండియా ప్రచారానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈనెల 18 నుంచి జూన్ 2 వరకూ.. ప్రచారం ముమ్మరంగా చేయడానికి సరిపడా షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకొంది.
విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, భోపాల్.. ఇలా ఇండియా అంతా చక్కర్లు కొట్టబోతోంది టీమ్. రాబోయే 20 రోజుల్లో ఎక్కడ చూసినా 'పెద్ది' మాత్రమే కనపడేలా ప్లాన్ చేస్తున్నారు. నిజంగా ఇది మంచి వ్యూహమే. ఇది వరకు 'పుష్ప 2' సినిమాకు ఇలాంటి హంగామానే చేశారు. దాదాపు 20 రోజుల పాటు ఇండియా చుట్టేశారు. ఆ ప్రచారంలో బన్నీ కూడా పాల్గొన్నాడు. బన్నీ వల్ల ఈ ఈవెంట్లన్నీ ఫుల్ సక్సెస్ అయ్యాయి. అది.. ఓపెనింగ్స్ కి బాగా ఉపయోగపడింది. ఇప్పుడు చరణ్ కూడా అదే చేయాలి. వీలైనంత మేరకు ప్రతీ ప్రమోషన్ ఈవెంట్ లోనూ చరణ్, జాన్వీ కపూర్ కనపడేలా ప్లాన్ చేయాలి. అప్పుడు రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఈమధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలు, చివరి నిమిషంలో హడావుడి పడి, ఏదో మొక్కుబడిగా ప్రమోట్ చేసుకొన్నాయి. `పెద్ది`కి కొంత టైమ్ దొరికింది. ఈ సమయాన్ని వాడుకొంటే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి.

