Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భగీరథ్‌కు సరెండరే మార్గం!

భగీరథ్‌కు సరెండరే మార్గం!

Telugu 360 1 week ago

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.

నిందితుడి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో బాధితురాలి ప్రవర్తన, కాల్ డేటా, ఆలస్యంగా ఫిర్యాదు చేయడం వంటి సాంకేతిక అంశాలను లేవనెత్తుతూ బెయిల్ కోసం గట్టి ప్రయత్నమే చేసినప్పటికీ, హైకోర్టు మాత్రం కేసు తీవ్రతను, ఆరోపణల స్వభావాన్ని బట్టి ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.

బాధితురాలు మైనర్ అని దర్యాప్తులో దాదాపుగా ఖరారు కావడం, ముందస్తు ఉపశమనం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించినా అక్కడ కూడా కోర్టు రిలీఫ్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయనకు పోలీసుల ముందు లొంగిపోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. శనివారం ఆయన పోలీసుల ఎదుట హాజరవ్వాల్సి ఉంది. తొలుత ఇరువర్గాల మధ్య వ్యక్తిగత వివాదంగా ప్రచారం జరిగినప్పటికీ, సాంకేతిక ఆధారాలు, బాధితురాలి వయసు ధృవీకరణ పత్రాలను పరిశీలించిన తర్వాత కేసు తీవ్రత ఒక్కసారిగా మారిపోయింది. చట్టపరమైన రక్షణ పొందేందుకు నిందితుడి తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, పరారీలో ఉండటం కంటే పోలీసుల ఎదుట లొంగిపోవడమే ఉత్తమమనే సూచనలు వస్తున్నాయి.

ఈ పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాజకీయంగా వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసిన సీఎం.. బండి సంజయ్‌కు కీలక సలహా ఇచ్చారు. రాజకీయ నాయకుడిగా నీతులు చెప్పే బండి సంజయ్, ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా తన కుమారుడిని స్వయంగా పోలీసుల వద్దకు తీసుకువచ్చి చట్టానికి సహకరించాలని హితవు పలికారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్ల ఈ కేసు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలపై నిత్యం విమర్శలు చేసే బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ ఉదంతం నైతికంగా ఇబ్బందికరంగా మారింది.

చట్టం ముందు అందరూ సమానమేనని, బాధితురాలికి న్యాయం జరిగేలా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. బండి భగీరథ్ పోలీసుల ముందు హాజరైతే, అధికారులు ఆయనను సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. దర్యాప్తుకు నిందితుడు ఎంతవరకు సహకరిస్తాడనే దానిపైనే తదుపరి అరెస్ట్ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. మొత్తానికి, గత కొన్ని రోజులుగా దోబూచులాడుతున్న ఈ కిడ్నాప్, వేధింపుల ఉదంతం ఇవాళ నిందితుడి లొంగుబాటుతో ఒక కీలక మలుపు తిరగబోతోందని స్పష్టమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360