అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్నామనే ఆందోళనలో ఉన్న సెనేటర్ ఎరిక్ ష్మిత్కు ఈసారి వింతైన శత్రువు దొరికారు. అది ఎవరో కాదు, హైదరాబాద్ శివార్లలో వెలసిన చిలుకూరు బాలాజీ .
అమెరికా వీసా కోసం ఐటీ నిపుణులు, విద్యార్థులు చేసే ప్రదక్షిణలను చూసి ఆయన బెంబేలెత్తిపోతున్నారు. ఈ వీసా వ్యవస్థ అంతా ఒక గ్లోబల్ వీసా కార్టెల్ అని, దీనికి హైదరాబాద్లోనే ఒక ప్రత్యేకమైన వీసా టెంపుల్ కూడా ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలను చూసి .. అంత పాపం అనుకుంటున్నారు.
బాలాజీ ప్రదక్షిణలు.. అమెరికాకు ఆందోళనలు!
బాలాజీ చుట్టూ భక్తులు చేసే ప్రదక్షిణలు చూసి, అవి అమెరికా ఆర్థిక వ్యవస్థను చుట్టేసే వ్యూహాలని ఆయన పొరబడ్డట్టున్నారు. సెనేటర్ భక్తులు పాస్పోర్టులతో ప్రదక్షిణలు చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ, అమెరికా కార్మికులు ఇంతగా గేమ్ చేసిన వ్యవస్థతో పోటీ పడలేరు అని వాపోయారు. అంటే, ఆయన దృష్టిలో మన ఐటీ కుర్రాళ్ళు రాసే కోడింగ్ కంటే, అక్కడ చిలుకూరులో చేసే 108 ప్రదక్షిణలే ఎక్కువ పవర్ ఫుల్ అన్నమాట! అమెరికా టెక్ కంపెనీలు భారతీయులకు ఇచ్చే జీతాల కంటే, భక్తులు బాలాజీకి మొక్కుకునే మొక్కులే వారి నిద్ర గెలుపుతున్నట్లు అనిపిస్తోంది. చదువు, నైపుణ్యం కంటే దైవబలం మీద సెనేటర్ కి ఉన్న ఈ గురి చూస్తుంటే, త్వరలో అమెరికా కాంగ్రెస్లో కూడా ఇలాంటి ప్రదక్షిణలు మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కార్టెల్ అంటే.. మన బాలాజీయేనా?
సాధారణంగా డ్రగ్స్, గ్యాంబ్లింగ్ వంటి వాటిని కార్టెల్ అంటారు. కానీ సెనేటర్ ష్మిత్ మాత్రం వీసా ప్రక్రియను ఒక కార్టెల్గా అభివర్ణించారు. అందులో చిలుకూరు బాలాజీ గుడిని ప్రధాన కేంద్రంగా చూపించడం ఆయనలోని అహంకారాన్ని, అసహాయతను చూపిస్తోంది. బిగ్ టెక్ కంపెనీలు అమెరికన్లను తీసేసి, తక్కువ జీతానికి భారతీయులను తెచ్చుకుంటున్నాయని ఆయన ఆవేదన. అయితే, ఆ తక్కువ జీతంతోనే భారతీయ ఇంజనీర్లు అమెరికా టెక్నాలజీని నడిపిస్తున్నారనే నిజాన్ని ఆయన సౌకర్యవంతంగా మర్చిపోయారు. బహుశా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంటే సెనేటర్ ఈ వీసా సైకాలజీ మీద ఎక్కువ రీసెర్చ్ చేసినట్టున్నారన్న సైటైర్లు వినిపిస్తోంది.
దేవుడికి కూడా వీసా కష్టాలు తప్పవా?
అమెరికా వీసా అపాయింట్మెంట్లు దొరకక ఇప్పటికే మనవాళ్లు సతమతమవుతుంటే, ఇప్పుడు ఏకంగా సెనేటర్ ఆ దేవుడినే టార్గెట్ చేయడం కొసమెరుపు. భక్తులు తమ పాస్పోర్టులను స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఆశీర్వాదం తీసుకోవడం ఆయనకు ఏదో పెద్ద నేరంలా కనిపిస్తోంది. చిలుకూరు బాలాజీ పేరు ఇప్పుడు అమెరికాలో మారుమోగడం చూస్తుంటే.. ఆ స్వామివారి మహిమ ఖండాంతరాలను దాటిపోయిందని అర్థమవుతోంది!

