ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇంచార్జుల నియామక ప్రక్రియలో పాటిస్తున్న ఫార్ములా పార్టీలోనే పెద్ద దుమారం రేపుతోంది.
వచ్చే ఎన్నికల కోసం ఆయన అవలంబిస్తున్న వ్యూహం క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలను, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న నేతలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కేవలం డబ్బు ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తామనే సంకేతాలు పంపుతున్నారు.
డబ్బుకే పెద్ద పీట
పార్టీని కాపాడుకోవాలంటే డబ్బు తప్ప ఏదీ అవసరం లేదని జగన్ అనుకుంటున్నారు. నియోజకవర్గాల్లో ఆర్థికంగా బలంగా ఉన్నవారు, ఎన్నికల ఖర్చును భరించగలిగేవారు వస్తే వారికే ఇన్ఛార్జ్ పదవులు, తద్వారా 'టికెట్లు' ఖాయమని ఆయన స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయం అంటే ప్రజా సేవ కాదు, అదొక 'వ్యాపారం అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడి పనిచేసిన కార్యకర్తల ప్రశ్న ఒక్కటే.. "పార్టీతో సంబంధం లేకపోయినా, ప్రజాబలం లేకపోయినా కేవలం డబ్బు ఉంటే సరిపోతుందా అని. రాజకీయ అనుభవం లేని వ్యక్తులు, నియోజకవర్గ సమస్యల మీద కనీస అవగాహన లేని వారు కేవలం సూట్కేసులు కుమ్మరిస్తే వారికి రెడ్ కార్పెట్ వేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన ధనవంతులకు పెద్దపీట వేస్తూ, ఏళ్ల తరబడి జెండా మోసిన వారిని విస్మరించడం జగన్ రాజకీయ పతనానికి నాంది అని విమర్శలు వస్తున్నాయి.
ప్రజాబలం కంటే ధనబలమే మిన్ననా?
ప్రజాస్వామ్యంలో ఓటర్లను ఆకట్టుకోవాల్సింది అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కానీ, కేవలం డబ్బు వెదజల్లి గెలవాలనుకోవడం అప్రజాస్వామికమని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. జగన్ వైఖరి వల్ల నియోజకవర్గాల్లోని నిజమైన నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని, దీనివల్ల పార్టీ నిర్మాణం దెబ్బతింటుందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రజలతో సంబంధం లేని పెట్టుబడిదారుల ను అభ్యర్థులుగా నిలబెడితే, ఓటర్లు వారికి తగిన గుణపాఠం చెబుతారనే భయం కూడా పార్టీలోని కొందరు సీనియర్లలో నెలకొంది.
పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి వాదులు
ఈ వింత పోకడల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. ఒకవైపు ఆర్థిక బలం ఉన్న అభ్యర్థుల కోసం జగన్ వేట సాగిస్తుంటే, మరోవైపు టికెట్లు దక్కవని భావిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి, కేవలం అభ్యర్థుల 'ఆర్థిక స్తోమత' మీదే జగన్ దృష్టి సారించడం వల్ల పార్టీ క్యాడర్ మానసికంగా కృంగిపోతోంది. ధన రాజకీయా వల్ల జగన్ ఆశించిన ఫలితం దక్కుతుందా లేక పార్టీ పునాదులకే ఎసరు పెడుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.

