పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన కంచుకోట అయిన భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో సుమారు 15,114 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2021లో నందిగ్రామ్లో ఓడిన మమత, ఈ సారి భవానీపూర్లో కూడా ఓడిపోవడం కలకలం రేపుతోంది.
కౌంటింగ్ ప్రారంభం నుండి సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగారు. 17వ రౌండ్ ముగిసే సమయానికి అధికారి స్పష్టమైన మెజారిటీ సాధించడంతో దీదీ ఓటమి ఖాయమైంది. కేవలం మమత మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. బీజేపీ 200 పైచిలుకు స్థానాల్లో ముందంజలో ఉండటంతో, 15 ఏళ్ల మమతా బెనర్జీ సుదీర్ఘ పాలనకు తెరపడినట్లయింది.
మమతా బెనర్జీ ఎన్నికల ఫలితాలను అంగీకరించడంలేదు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, దాదాపు 100 సీట్లను లూటీ చేశారని ఆమె ఆరోపించారు. మేము మళ్ళీ పుంజుకుంటాం, పోరాటం ఆపము అని ప్రకటించారు. ముఖ్యంగా ఈ ఎన్నికలకు ముందు జరిగిన ఓటర్ల జాబితా సవరణ లో 90 లక్షల మంది ఓటర్లను తొలగించడమే తమ ఓటమికి కారణమని TMC వర్గాలు వాదిస్తున్నాయి.
బీజేపీ శ్రేణులు ఈ విజయాన్ని బెంగాల్ విముక్తి గా అభివర్ణిస్తున్నాయి. బెంగాల్ ఇప్పుడు భయం నుండి విముక్తి పొందింది, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది అని ప్రధాని నరేంద్ర మోదీ తన విజయ ప్రసంగంలో పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా అజేయంగా నిలిచిన మమత, తన సొంత నియోజకవర్గంలోనే పరాజయం చెందడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

