తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే ఊహించని పరాభవాన్ని మూటగట్టుకుంది. పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఎదురైన పరాజయం ఒక ఎత్తైతే, సాక్షాత్తూ ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ తన కంచుకోట అయిన కొలత్తూరు నియోజకవర్గంలో ఓడిపోవడం డీఎంకే శ్రేణులను కోలుకోలేని దెబ్బ తీసింది.
2011 నుంచి వరుసగా మూడుసార్లు ఇదే స్థానం నుంచి గెలుపొందిన స్టాలిన్, ఈసారి తన రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూశారు. అనామకుడైన టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో సుమారు 8,000 ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఒకవైపు సిట్టింగ్ ముఖ్యమంత్రి ఓటమిపాలైతే, మరోవైపు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి మాత్రం తన ప్రభావాన్ని చాటుకున్నారు. అన్నాడీఎంకే కంచుకోట అయిన ఎడప్పాడి నియోజకవర్గం నుంచి ఆయన తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. పళనిస్వామి తన సొంత నియోజకవర్గంలో పార్టీ కేడర్ను, ఓటు బ్యాంకును పటిష్టంగా ఉంచుకోవడంలో సఫలమయ్యారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన స్టాలిన్ ఐదేళ్లకే ఓటమి పాలవ్వడం, అధికార వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది.
డీఎంకేకు ఈ ఎన్నికలు కేవలం అధికారాన్ని కోల్పోవడం మాత్రమే కాదు, ఒక రాజకీయ ఉనికి ప్రశ్నగా మారాయి. మంత్రులు , ప్రముఖ నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉండటం లేదా ఓడిపోవడం పార్టీ పతనాన్ని సూచిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని గెలవలేకపోవడం స్టాలిన్ నాయకత్వంపై పడ్డ అతిపెద్ద మచ్చగా భావిస్తున్నారు.
స్టాలిన్ ఓటమి డీఎంకే చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకుని భవిష్యత్తు రేసులో నిలవగా, స్టాలిన్ మాత్రం ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. కొలత్తూరులో వెలిగిన ఉదయసూర్యుడు ఇప్పుడు అస్తమించడం ద్రవిడ రాజకీయాల్లో ఒక భారీ కుదుపు.

