ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అదుపు చేయడానికి సంచలన ప్రకటన చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన బహిరంగ సభలో జనాభా నిర్వహణ విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.
పిల్లలు భారం కాదు.. రాష్ట్రానికి సంపద అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
నరసన్నపేట సభలో చంద్రబాబు జనాభా తగ్గిపోతుండటం వల్ల భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగి, యువశక్తి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అధిగమించడానికి, ఎక్కువ మంది పిల్లలను కనే కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఇందులో భాగంగానే, కుటుంబంలో మూడో బిడ్డ జన్మనిస్తే 30,000 , నాలుగో బిడ్డ జన్మిస్తే 40,000 చొప్పున ఆర్థిక సహాయం నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు.
ఈ సరికొత్త జనాభా నియంత్రణ వ్యతిరేక విధానానికి సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలను ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రజల ముందుకు తీసుకురానుందని చంద్రబాబు తెలిపారు. కేవలం ఒకేసారి ఇచ్చే ఆర్థిక సాయమే కాకుండా, ఆయా పిల్లల సంరక్షణ, పౌష్టికాహారం , విద్యకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని రూపొందిస్తోందని పేర్కొన్నారు. రాబోయే ఆగస్టు నాటికి ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో పూర్తిగా అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది.
తల్లికి వందనం పథకం నగదు కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. భగవంతుడు కరుణించి, రాష్ట్ర ఆర్థిక వనరులు మరింత మెరుగైతే.. ప్రస్తుతం ఇస్తున్న 15,000 ఆర్థిక సాయాన్ని భవిష్యత్తులో మరింత పెంచడానికి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. చిన్న కుటుంబాల ధోరణి మారి, మళ్లీ కుటుంబాల్లో పిల్లల కిలకిలరావాలు వినిపించాల్సిన అవసరం రాష్ట్ర ప్రగతికి ఎంతో కీలకమని ఆయన పిలుపునిచ్చారు.

