యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కేవలం ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా మిగల్లేదు.
జోసఫ్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా మద్దతు ప్రకటించడంతో.. చాలా కాలంగా తెరవెనుక సాగుతున్న మతపరమైన, రాజకీయ వ్యూహాల అసలు ముసుగు ఒక్కసారిగా తొలగిపోయింది. సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు, ఆరెస్సెస్ లాంటి జాతీయవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని జోసెఫ్ గతంలో చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానంలా వైరల్ అవుతున్నాయి. చివరికి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు సపోర్టు చేస్తూ దేశ నాయకత్వంపై విమర్శలు చేశాడు.
దేశద్రోహం, దైవద్రోహం చిన్నది కాదు !
ఇంతటి తీవ్రమైన దేశద్రోహ, దైవద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని జగన్ రెడ్డి సమర్థించాల్సిన పరిస్థితి రావడం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. హే రామ్ అంటూ జగన్ రెడ్డి చేసిన ట్వీట్ కేవలం ఒక యూట్యూబర్ను కాపాడుకునే ప్రయత్నం కాదు, ఒక నిర్దిష్ట వ్యూహం ప్రకారం హిందూత్వంపై దాడి చేసే శక్తులన్నింటినీ ఏకం చేసి, వారికి ఒక రాజకీయ రక్షణ కవచాన్ని కల్పించే వ్యవస్థీకృత ప్రయత్నం. గతంలో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ధోరణులు స్పష్టంగా కనిపించాయి. కంచె ఐలయ్య లాంటి వివాదాస్పద రచయితలతో 'మతం మారితే తప్పేంటి?' అనే అర్థం వచ్చేలా వ్యాసాలు రాయించి, తన సొంత పత్రిక ఎడిటోరియల్ పేజీలలో ప్రముఖంగా ప్రచురించడం ద్వారా సమాజంలో మత మార్పిళ్లకు అనుకూలమైన వాతావరణాన్ని పరోక్షంగా ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ పత్రికా కథనాల స్థాయి దాటి, క్షేత్రస్థాయిలో హిందూ సమాజాన్ని, సనాతన మూలాలను విచ్ఛిన్నం చేసే శక్తులను ఒక ముఠాగా మార్చి వారి వ్యవహారాలను విస్తృతం చేస్తున్నారనే వాదనకు తాజా పరిణామాలు బలమిస్తున్నాయి.
జోసఫ్ చేసింది దేశంపై కుట్రే !
బచ్చలకూరి జోసెఫ్ సన్నాఫ్ డానియల్ అనే వ్యక్తి వాక్స్వాతంత్రం ముసుగులో సమాజంలో చీలికలు తేవడానికి, కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బయటి శక్తుల ఫండింగ్తో కుట్రలు పన్నారనేది పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశం. సమాజంలో చిచ్చు పెట్టాలనుకునే ఇటువంటి శక్తులకు జగన్ రెడ్డి నేరుగా వత్తాసు పలకడం.. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయవాద శక్తులను విస్మయానికి గురిచేస్తోంది. ముఖ్యంగా బీజేపీలోనో లేదా ఇతర జాతీయ సంస్థల్లోనో ఉంటూ.. ఇంకా జగన్ రెడ్డి పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించే నాయకులు ఎవరైనా ఉంటే, వారు ఇప్పుడు జోసెఫ్కు లభించిన మద్దతును చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు హిందూ సెంటిమెంట్లను దెబ్బతీస్తూ, మరోవైపు జాతీయ భద్రతకు ముప్పుగా మారిన ఉపా చట్టం నిందితుడి తరఫున నిలబడటం జగన్ రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట .
జగన్ మద్దతు వెనుక ఉన్న కారణాలు దర్యాప్తు చేయాల్సిందే!
ఇటువంటి దైవద్రోహులు, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే శక్తుల పట్ల ప్రభుత్వం కానీ, సమాజం కానీ ఎలాంటి నిర్లక్ష్యాన్ని వహించకూడదు. జగన్ రెడ్డి లాంటి పెద్ద తలకాయలు నేరుగా ఇటువంటి శక్తుల వెనుక ఉండి నడిపిస్తున్నారనే నిజాన్ని ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. హిందూత్వంపై జరిగే ప్రతి చిన్న దాడి వెనుక ఉన్న పొలిటికల్ నెట్వర్క్ను ఛేదించడానికి, చట్టపరమైన వేట ను మరింత తీవ్రం చేయాలి. సనాతన ధర్మాన్ని రక్షించుకోవడంతో పాటు, దేశ సమగ్రతను కాపాడుకోవడానికి ఇటువంటి దేశ విద్రోహ ముఠాల మూలాలను వెతికి పట్టుకుని కఠినంగా శిక్షించడమే ఏకైక మార్గం.

