ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా, ముఖ్యంగా మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వికృతానందం పొందుతున్న సోషల్ మీడియా సైకోలపై ఉపముఖ్యమంత్రి నారా పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు.
కేవలం పోలీసులకు ఫిర్యాదులు చేసి వదిలేయడం కాకుండా.. సోషల్ మీడియాలో అసభ్యకర, అరాచక పోస్టులు పెట్టే వారిని కట్టడి చేసే పూర్తి బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు. ఇందుకోసం తానే స్వయంగా తన డిప్యూటీ సీఎం అధికారిక కార్యాలయంలో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ విభాగం నిరంతరం నిఘా పెడుతూ డేటాను సేకరిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలువురు కీలక నిందితుల అరెస్టుల పర్వం ప్రారంభమైంది.
అరెస్టులు చేయడం వారిని ప్రోత్సహించడమే
అయితే, కేవలం అరెస్టులు చేసి జైలుకు పంపడం వల్ల మాత్రమే ఈ సోషల్ మీడియా వైరస్ను పూర్తిగా అరికట్టలేమని పవన్ కళ్యాణ్కు ముందే తెలుసు. ఎందుకంటే, ప్రస్తుతం సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారిలో చాలా మంది.. తాము అరెస్ట్ అయితే తమకు పొలిటికల్ మైలేజ్ వస్తుందని, పార్టీ పెద్దల దగ్గర ప్రాపకం దక్కుతుందని భావిస్తున్నారు. బూతులు తిట్టి జైలుకు వెళ్తే.. తమ పార్టీ అధినాయకత్వం తమను పెద్ద లీడర్లుగా గుర్తిస్తుందనే భ్రమలో కొందరు సైకోలు ఉన్నారు. అలాంటి వారిని కేవలం అరెస్ట్ చేస్తే, వారు అనుకున్న ట్రాప్లో పోలీసులు పడినట్లవుతుంది. అందుకే వాక్ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ సమాజాన్ని కలుషితం చేసే వారికి నిజమైన 'భయం' ఎలా రుచి చూపించాలో పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
అలాంటి వారిపై జీవితాంతం బాధపడేలా చర్యలు
ఈ మిషన్లో భాగంగా చట్టప్రకారం అలాంటి వీరులకు ఎలా చుక్కలు చూపించాలో పవన్ కళ్యాణ్ లోతుగా అధ్యయనం చేశారు. కేవలం క్రిమినల్ కేసులు మాత్రమే కాకుండా.. అసభ్యకర పోస్టులు పెట్టే వారి పాస్పోర్టులు రద్దు చేయడం, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా మార్చడం, ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుంటే సదరు కంపెనీల యాజమాన్యాలకు పోలీసుల నుంచి అధికారికంగా నోటీసులు పంపి వారి ఉద్యోగాలు ఊడేలా చేయడం వంటి తీవ్రమైన పౌర పరిణామాలను అమలు చేయబోతున్నారు. దీనివల్ల సోషల్ మీడియాలో ఒక అబద్ధం ప్రచారం చేస్తే భవిష్యత్తు, కెరీర్ మొత్తం శూన్యమైపోతుందనే భయం ప్రతి ఒక్కరిలోనూ మొదలవుతుంది.
విదేశాల్లో ఉన్న వారిపై లుకౌట్ నోటీసులు
ఇప్పటికే విదేశాల్లో కూర్చుని ఏపీలోని మహిళలపై, నాయకులపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న సైకోల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తయింది. వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పాటు, వీసాల రద్దు, డిపోర్టేషన్ ప్రక్రియలపై విదేశాంగ శాఖ సాయంతో పవన్ ఆఫీస్ టాస్క్ ఫోర్స్ ముందడుగు వేస్తోంది. డిజిటల్ ప్రపంచంలో దాక్కుని సమాజంపై విషం చిమ్మే వారికి ఇకపై పవన్ కళ్యాణ్ మార్క్ ట్రీట్మెంట్ గ్యారెంటీ అని స్పష్టమవుతోంది. రాజకీయ ప్రాపకం కోసం బూతులు నమ్ముకున్న వారి బతుకులు రోడ్డున పడటం ఖాయమనే సంకేతాలు ఈ తాజా వ్యూహం ద్వారా అందుతున్నాయి.

