గణాంకాలు అబద్ధం చెప్పవు.. కానీ జగన్ అబద్ధాలనే గణాంకాలుగా మారుస్తున్నారు.. అసలు కాగ్ రిపోర్టులను పెట్టకుండా ఆయన తన ఆస్థాన నిపుణులు తయారు చేసిన సెలెక్టివ్ సమాచారం గ్రాఫిక్స్ తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు.
2018-19లో చంద్రబాబు దిగిపోయేనాటికి కేవలం 14,014 కోట్లు గా ఉన్న రెవెన్యూ లోటును, జగన్ తన ఐదేళ్ల అధికార ముగింపు నాటికి ఏకంగా 64,032 కోట్లకు పెంచేశారు. అంటే రెవెన్యూ లోటును ఏకంగా మూడింతలు చేశారు. ఖజానాకు వచ్చిన ఆదాయంలో 88 శాతం కేవలం ఉచితాలు, జీతాలు, అప్పుల వడ్డీలకే తగలేశారని, రేపటి తరం కోసం ఆస్తులను సృష్టించే మూలధన వ్యయానికి కేవలం 12 శాతం మాత్రమే వాడారని లెక్కలు చెబుతున్నాయి.
2024లో చంద్రబాబు నాయుడి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు మళ్లీ పరుగుందుకుంది. జగన్ హయాం చివరిలో FY24 రాష్ట్ర వృద్ధి రేటు కేవలం 3.4 శాతానికి పడిపోగా.. కూటమి ప్రభుత్వం తీసుకున్న ల్యాండ్ మార్క్ నిర్ణయాల వల్ల 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నాటికి అది 10.5 శాతానికి , రెండో త్రైమాసికం నాటికి 11.3 శాతానికి దూసుకెళ్లింది. ఇది జాతీయ సగటు 7.8 శాతానికి కంటే చాలా ఎక్కువ. అమరావతి పునఃప్రారంభం, పోర్టుల నిర్మాణం, ఇండస్ట్రియల్ పుష్ వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని ప్రభుత్వం చాటిచెప్పింది.
అయితే జగన్ మాత్రం ఆదాయం పెరగలేదని ఏవో అర్థం లేని శాతాలతో ఆరోపణలు చేస్తున్నారు. పది శాతం మేర జీఎస్డీపీ పెరిగిందంతా అబద్దమని..అదే నిజమైతే ఆ స్థాయిలో పది శాతం ఆదాయం.. పన్ను వసూళ్లు పెరగాలంటున్నారు. ఆయన లెక్కలు ఆర్థిక నిపుణులకు కూడా అర్థం కావు. అయితే కాగ్ రిపోర్టులు వచ్చినప్పుడల్లా తమదైన లెక్కలతో ఇలాంటి ప్రకటనలు చేస్తూంటారు. అసెంబ్లీలో తేల్చుకుందాం రమ్మంటే మాత్రం పారిపోతారు.

