ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన జనాభా నిర్వహణ విధానం ఇప్పుడు ఒక విధానపరమైన చర్చ కంటే వ్యక్తిగత దూషణలకు వేదికగా మారింది.
ఏవైనా లోపాలు ఉంటే ఒక పాలసీని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ దాన్ని ఒక నాయకుడి కుటుంబానికి అన్వయిస్తూ వ్యక్తిగత దాడులకు దిగడం రాజకీయ పరిణతి అనిపించుకోదు.
ఆరోగ్యకరమైన చర్చ ప్రజాస్వామ్యానికి మంచిది
ఒక నాయకుడు ఒక దీర్ఘకాలిక ప్రణాళికను లేదా విధానాన్ని ప్రతిపాదించినప్పుడు, దానిలోని సాధ్యాసాధ్యాలపై చర్చ జరగడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య లక్షణం. చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన జనాభా పెంపు పిలుపు కూడా అలాంటిదే. భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కోబోయే వృద్ధాప్య జనాభా సంక్షోభాన్ని, నియోజకవర్గాల పునర్విభజనలో జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అయితే, ఈ గంభీరమైన అంశాన్ని పక్కన పెట్టి, సోషల్ మీడియాలో కొందరు ఆయన కుమారుడు లోకేష్కు ఒకే సంతానం ఉన్నారంటూ వ్యక్తిగత దాడులకు దిగడం అత్యంత విచారకరం. ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్నారంటే ఆయన విధానాలను విమర్శించవచ్చు కానీ, వారి వ్యక్తిగత జీవితాలను, కుటుంబ నిర్ణయాలను రాజకీయ చదరంగంలోకి లాగడం ఏ రకమైన సంస్కృతి?
ఫెమినిస్టుల ముసుగులో దాడి
నటి పూనమ్ కౌర్ వంటి వారు కూడా ముందు మీ ఇంటి నుంచే మొదలుపెట్టాలి అని వ్యాఖ్యానించడం ద్వారా చర్చను దారి మళ్లించారు. చంద్రబాబు ఎవరినీ బలవంతంగా పిల్లల్ని కనమని శాసించడం లేదు. కేవలం ఒక ప్రోత్సాహక విధానాన్ని మాత్రమే ప్రకటించారు. ఏదైనా అంశంపై పాలసీ తయారు చేయడం ప్రభుత్వ విధి. ఎవరికైనా పిల్లల్ని కనాలా వద్దా అన్నది వారి వ్యక్తిగత ఇష్టం . వారి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. లోకేష్ దంపతులకు ఒక బాబు ఉండటం వెనుక వారి వ్యక్తిగత కారణాలు ఉండవచ్చు. దానిని చంద్రబాబు ప్రతిపాదించిన రాష్ట్ర స్థాయి పాలసీతో ముడిపెట్టడం కేవలం ద్వేషంతో కూడిన విమర్శే తప్ప మరొకటి కాదు.
పబ్లిసిటీ కోసం దారి తప్పడం విలువల్లేని మనమే
ఫెమినిస్టులు , మహిళా సంఘాల నాయకులు కూడా ఒక విధానాన్ని వ్యతిరేకించేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మహిళల స్వయంప్రతిపత్తి గురించి మాట్లాడే వారు, ఒక నాయకుడి కోడలిని లేదా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం పరస్పర విరుద్ధం . విమర్శ ఆలోచింపచేసేలా ఉండాలి కానీ, పబ్లిసిటీ కోసం వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. చంద్రబాబు ప్రతిపాదించిన పాలసీ ఎందుకు తప్పో వివరించవచ్చు.. కానీ ఆయన ఇంటి విషయాలను బజారుకు లాగడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు.
రాజకీయంగా చంద్రబాబుకు ఎలాంటి లాభం ఉండదు !
చంద్రబాబు ఆందోళన అంతా 2047 నాటికి దేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కోబోయే డెమోగ్రాఫిక్ సంక్షోభం గురించే. జపాన్, యూరప్ వంటి దేశాలు ఇప్పుడు అనుభవిస్తున్న చేదు అనుభవాలను మన రాష్ట్రం రుచి చూడకూడదన్నదే ఆయన తాపత్రయం. ఒక విజనరీగా ఆయన సమస్యను ముందే గుర్తించి అప్రమత్తం చేస్తున్నారు. దానికి సహకరించడం లేదా లోపాలను ఎత్తిచూపడం వైపు కాకుండా, కేవలం ట్రోలింగ్ వైపు వెళ్లడం వల్ల చర్చ స్థాయి పడిపోతోంది. ఈ ప్రతిపాదన వల్ల ఆయనకు రాజకీయంగా లాభమే ఉండదని వీళ్లంతా గుర్తించాలి. భవిష్యత్ కోసమే ఆయన మాట్లాడుతున్నారని తెలుసుకోవాలి.

