తమిళనాట విజయ్కు పాలనాపరమైన సవాళ్లే కాదు.. రాజకీయ సవాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సీఎంతో కలిపి కేవలం 9 మంది మంత్రులతోనే సాగుతున్న తన తొలి కేబినెట్ను పూర్తిస్థాయిలో విస్తరించాల్సి ఉంది.
విజయ్కు ప్రభుత్వం ఏర్పాటులో అండగా నిలిచిన మిత్రపక్షాలు, ఇతర వర్గాలను కేబినెట్ బెర్తులతో సంతృప్తి పరచడమే ఇప్పుడు ఆయన ముందున్న అతి పెద్ద రాజకీయ సవాల్గా మారింది.
ప్రాధాన్యత కోరుతున్న కాంగ్రెస్
డీఎంకే కూటమిని వీడి విజయ్ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి ఈ విస్తరణలో పెద్దపీట వేయబోతున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న హస్తం పార్టీకి కేబినెట్లో రెండు కీలక మంత్రి పదవులు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్తో పాటు బయట నుంచి మద్దతు ఇస్తున్న కమ్యూనిస్టు పార్టీలు , అలాగే దళిత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వీసీకే లకు కూడా ఈ విస్తరణలో సముచిత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల అనంతరం ఏర్పడిన ఈ కొత్త సమీకరణాలో , మిత్రపక్షాల కోటా కింద కనీసం 4 నుంచి 5 మంత్రి పదవులను కేటాయించేలా సీఎం విజయ్ వ్యూహరచన చేస్తున్నారు.
అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకూ ఆశలు
ఊహించని ట్విస్ట్ ఇస్తూ.. ప్రతిపక్ష అన్నాడీఎంకే లో తిరుగుబాటు జెండా ఎగరేసిన రెబల్ వర్గం కూడా ఇప్పుడు పదవుల రేసులోకి రావడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఎన్నికల్లో 47 సీట్లు గెలుచుకున్న అన్నాడీఎంకేను చీల్చుతూ.. సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణిల నాయకత్వంలోని దాదాపు 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్లో విజయ్ ప్రభుత్వానికి జై కొట్టారు. ఎడప్పాడి పళనిస్వామి వైఖరి నచ్చక, జయలలిత ఆశయాల సాధన కోసమే విజయ్కు మద్దతు ఇస్తున్నామని చెప్తున్న ఈ మెజారిటీ రెబల్ వర్గం.. ఇప్పుడు కేబినెట్లో తమకూ తగిన ప్రాధాన్యత కావాలని పట్టుబడుతోంది.
విజయకు చాణక్యం చూపాల్సిన సమయం
సొంత పార్టీకి చెందిన బుస్సి ఆనంద్, ఆధవ్ అర్జున వంటి కోర్ టీమ్ను కాపాడుకుంటూనే.. అటు కాంగ్రెస్, వీసీకేలను బ్యాలెన్స్ చేయడం, ఇటు అన్నాడీఎంకే రెబల్స్కు అన్యాయం జరగకుండా చూసుకోవడం విజయ్కు కత్తిమీద సాము లాంటిదే. మిత్రపక్షాల ఆశలు, సామాజిక సమీకరణాల మధ్య సమతుల్యత దెబ్బతింటే కొత్త ప్రభుత్వ స్థిరత్వానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఈ తొలి కేబినెట్ విస్తరణ సంక్షోభాన్ని తన పొలిటికల్ చాణక్యంతో ఎలా అధిగమిస్తారోనని తమిళనాడు అంతా అమితాసక్తితో గమనిస్తోంది.

