దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో అపార్ట్మెంట్ల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరడంతో రియల్ ఎస్టేట్ విక్రయాల్లో స్వల్ప స్తబ్దత కనిపిస్తోంది.
గత కొన్నేళ్లుగా భూమి విలువ, నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడం వల్ల బిల్డర్లు ఫ్లాట్ల ధరలను భారీగా పెంచుతున్నారు. ఫలితంగా మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తికి ఈ ధరలు సవాలుగా మారడంతో, కొత్త ప్రాజెక్టులలో విక్రయాల వేగం గతంతో పోలిస్తే కొంత మేర తగ్గుముఖం పట్టింది.
ధరల పెరుగుదలతో పాటు బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచడం కూడా కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నెలవారీ వాయిదాలు భారం కావడంతో చాలా మంది సొంతింటి కలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఐటీ రంగం వంటి ప్రధాన ఉపాధి వనరులు ఉన్న నగరాల్లో కూడా గృహ రుణాల వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా కొత్త ఇన్వెస్టర్లు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇరవైశాతం వరకూ అమ్మకాలు తగ్గడంతో ఇన్వెంటరీగా పెరుగుతోంది.
హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ప్రీమియం ఫ్లాట్లకు ఉన్న ఆదరణ కొనసాగుతున్నప్పటికీ, తక్కువ , మధ్యతరగతి బడ్జెట్ విభాగాల్లో అమ్మకాలు తగ్గాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కంటే సిద్ధంగా ఉన్న ఫ్లాట్ల వైపే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. అపార్ట్మెంట్ల నిర్వహణ ఖర్చులు , ఇతర పన్నులు కూడా అదనపు భారంగా మారుతుండటంతో రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొంత సందిగ్ధత నెలకొంది.
ఈ విక్రయాల తగ్గుదల తాత్కాలికమేనని కొంతమంది మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పండుగ సీజన్లలో బ్యాంకులు ఇచ్చే ఆఫర్లు , బిల్డర్లు ప్రకటించే రాయితీల వల్ల మళ్ళీ మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వాలు గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలు అందించి, వడ్డీ రేట్లు తగ్గితేనే సామాన్యుడి సొంతింటి కల మళ్ళీ సాకారం అయ్యే దిశగా అడుగులు పడతాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

