దేశంలోకి వస్తున్న కొత్త పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రముఖ జాతీయ బిజినెస్ పత్రిక బిజినెస్ స్టాండర్డ్ ప్రాజెక్ట్స్ టుడే నివేదికల ఆధారంగా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం..
కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ ఊహించని రీతిలో రికార్డు పురోగతిని సాధించింది. గత రెండేళ్ల వ్యవధిలో పెట్టుబడుల ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానం నుంచి ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది.
ఆర్థిక సంవత్సరం 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరం అంటే వైసీపీ అధికారంలో ఉన్న చివరి సంవత్సరంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 9వ స్థానంలో నిలిచింది. ఆ తదుపరి ఏడాది FY25 నాటికి తన స్థానాన్ని క్రమంగా మెరుగుపరుచుకుంటూ వచ్చిన రాష్ట్రం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలోనే అత్యధికంగా పెట్టుబడులు సాధిస్తున్న టాప్-10 రాష్ట్రాల జాబితాలో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. పారిశ్రామిక వాతావరణం, ప్రభుత్వ పాలసీలలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్లే ఈ భారీ మార్పు సాధ్యమైందని నివేదిక స్పష్టం చేసింది.
ఈ జాబితాలో పారిశ్రామిక దిగ్గజ రాష్ట్రమైన మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని సాధించి ఇతర అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు గట్టి పోటీ ఇచ్చింది. రాజస్థాన్ 3, గుజరాత్ 4, ఒడిశా 5వ స్థానాల్లో నిలవగా.. పారిశ్రామికంగా ఎంతో ముందంజలో ఉండే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక , తెలంగాణ , తమిళనాడు కంటే ఏపీ చాలా వేగంగా పెట్టుబడులను ఆకర్షించింది.
రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వేగవంతమైన అనుమతులు , సింగిల్ విండో సిస్టమ్ సమర్థవంతంగా పనిచేయడం వల్లే అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. మూడేళ్ల వ్యవధిలోనే 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకడం అనేది రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుకు, యువత ఉద్యోగావకాశాలకు శుభపరిణామం.

