ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల ప్రక్రియను పరుగులు తీయిస్తోంది. రాష్ట్ర విద్యా, ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసిన ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 ద్వారా నాలుగు విడతల్లో మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి అధికారిక యంత్రాంగం చర్యలను వేగవంతం చేసింది.
కోర్టు చిక్కులు, ఆలస్యాలకు తావులేకుండా పారదర్శకంగా, పక్కా క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తుండటంపై రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల నుంచి హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి.
క్యాలెండర్కు తగ్గట్లుగా ఉద్యోగ ప్రకటనలు
ఈ మెగా నియామకాల ప్రణాళికను నాలుగు దశల్లో వర్గీకరించి పక్కా టైమ్లైన్తో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి దశ కింద 1,523 లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడి దరఖాస్తుల ప్రక్రియ సాగుతోంది. రెండో దశ ద్వారా 3,168 పోస్టులను భర్తీ చేయనుండగా, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. ఇక మూడో దశ లో 2,388 పోస్టులు, నాలుగో దశ కింద అత్యధికంగా 2,981 పోస్టుల భర్తీకి అక్టోబర్ 15న ఒకేసారి నోటిఫికేషన్లు జారీ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రకటనలు మాత్రమే కాదు .. భర్తీ వరకూ పక్కా ప్లాన్
గతంలో మాదిరిగా ప్రతిపాదనలకే పరిమితం కాకుండా, స్పష్టమైన తేదీలతో జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అమలు దిశగా అడుగులు వేయడం ఆయన దూరదృష్టికి, పాలనా సమర్థతకు నిదర్శనమని ఉద్యోగార్థులు భావిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల గుర్తింపు నుంచి పరీక్షల నిర్వహణ, నియామకాల వరకు సమగ్ర పర్యవేక్షణ బాధ్యతలను లోకేష్ స్వయంగా సమీక్షిస్తుండటంతో వ్యవస్థలో వేగం పెరిగింది.
ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ ఫాస్ట్ ట్రాక్ నియామకాల ప్రక్రియ పెద్ద ఊరటనిస్తోంది.
వైసీపీ ఎన్ని పిటిషన్లు వేసినా లీగల్ టీం రెడీ
ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టత ఉండటంతో అభ్యర్థులు గందరగోళం లేకుండా తమ ప్రిపరేషన్పై దృష్టి సారించగలుగుతున్నారు. ఒకవైపు ప్రైవేట్ రంగంలో గ్లోబల్ కంపెనీలను తెచ్చి వేలాది ఐటీ, పారిశ్రామిక ఉద్యోగాలు కల్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న 10 వేలకు పైగా పోస్టులను క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తుండటం ద్వారా నారా లోకేష్ యువత ఆశాజ్యోతిగా నిలుస్తున్నారనడంలో సందేహం లేదు. అదే సమయంలో వైసీపీ కుట్రలు కూడా ఎలాగూ జరుగుతాయి. అందుకే నారా లోకేష్ లీగల్ గా కూడా అప్రమత్తంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

