తమిళనాడు పరిశ్రమల మంత్రి ఎస్. కీర్తన చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా పెట్టుబడిదారులకు పిలుపునివ్వడం సోషల్ మీడియాలో ట్రోలింగ్కు కారణం అయింది.
29 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కీర్తన, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు చేసిన ఈ సరికొత్త ప్రయత్నంపై తమిళనాడు నుంచి పలువురు వ్యతిరేక పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. కానీ లోకేష్ మాత్రం.. ఈ ట్రోలింగ్ ఏవీ పెట్టుబడులను తీసుకు రావొద్దని.. ప్రయత్నాలు కొనసాగించాలని ధైర్యం చెప్పారు.
పెట్టుబడుల మంత్రి రీల్స్ స్ట్రాటజీ
TVK ప్రభుత్వంలో పరిశ్రమల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కీర్తన ఒక ప్రొఫెషనల్ డిజిటల్ స్ట్రాటజిస్ట్ నేపథ్యం నుంచి వచ్చారు. అందుకే యువతను , అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ట్రెండీ మ్యూజిక్ , ఎడిటింగ్తో ఒక వీడియోను రూపొందించారు. అయితే, ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి రీల్స్ చేయడం ఏమిటనేది డీఎంకే మద్దతుదారుల ప్రశ్న. సాంప్రదాయ ద్రావిడ రాజకీయాలకు అలవాటు పడిన తమిళనాట, ఒక మంత్రి సినిమాల తరహాలో రీల్స్ చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలను తీసుకురావాల్సింది సెక్రటేరియట్లో చర్చల ద్వారా కానీ, ఇలాంటి రీల్స్ ద్వారా కాదు" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే, ఆమె హిందీ, తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ చేసిన ప్రసంగాలను కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక సీరియస్ పోర్ట్ఫోలియోను ఆమె గ్లామరైజ్ చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.
నారా లోకేష్ సంఘీభావం - అమూల్యమైన సలహా
కీర్తనపై జరుగుతున్న ఈ ట్రోలింగ్ను గమనించిన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆమెకు మద్దతుగా ఎక్స్ వేదికగా స్పందించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త తరం నాయకులు ఇలాంటి సరికొత్త పద్ధతులను అనుసరించడంలో తప్పు లేదన్నది లోకేష్ అభిప్రాయం. కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా, ప్రజలకు మరియు ఇన్వెస్టర్లకు చేరువయ్యేందుకు టెక్నాలజీని వాడుకోవడం మంచి పరిణామమని ఆయన కీర్తనను అభినందించారు. విమర్శలను పట్టించుకోవద్దు.. మీ ఫోకస్ అంతా కేవలం గ్రౌండ్ లెవల్లో పెట్టుబడులు వచ్చేలా చూడటంపైనే పెట్టండి. చివరికి మీరు తెచ్చే ఉద్యోగాలే ఈ ట్రోల్స్కు సమాధానం చెబుతాయి అని సలహా ఇచ్చారు. గతంలో తాను కూడా ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నానని గుర్తు చేస్తూ, పనితీరుతోనే ప్రత్యర్థుల నోళ్లు మూయించాలని ఆయన సూచించారు.
కీర్తనకు ఇతర వర్గాల నుంచి సపోర్ట్
ముఖ్యమంత్రి విజయ్ కూడా తన కేబినెట్ సహచరురాలికి అండగా నిలిచారు. పాతకాలపు పద్ధతులకు స్వస్తి చెప్పి, తమిళనాడును గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా మార్చడానికి ఇలాంటి వినూత్న ప్రచారాలు అవసరమని టీవీకే శ్రేణులు వాదిస్తున్నాయి. ఈ వివాదం కారణంగా మంత్రి కీర్తన ఫాలోయింగ్ సోషల్ మీడియాలో అమాంతం పెరిగింది.

