'మన శంకర వర ప్రసాద్ గారు' కంటే ముందు రావాల్సిన సినిమా 'విశ్వంభర'. ఈ సినిమా మొదలెనప్పుడు మంచి అంచనాలే ఉండేవి. జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి కథ, క్యారెక్టరైజేషన్, నెవర్ బిఫోర్ వరల్డ్ సెటప్, విజువల్ ఎఫెక్ట్స్, బింబిసార దర్శకుడి రెండో సినిమా..
ఇలా ఏ కోణంలో చూసినా టెమ్టింగ్ ప్రాజెక్టే. కానీ.. ఈ సినిమా భరించలేనంత ఆలస్యమైంది. దానికి కారణాలు అనేకం. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకపోవడంతో రిలీజ్ డేట్ మారుతూ వచ్చింది. 'విశ్వంభర' తరవాత మొదలైన అనిల్ రావిపూడి సినిమా విడుదలై, మరో సినిమాని కూడా మొదలెట్టేశారు. కానీ.. 'విశ్వంభర'కు మోక్షం దక్కలేదు. ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అవ్వకపోవడం వల్ల… కష్టాలు కంటిన్యూ అయ్యాయి. ఈ సినిమా కోసం మరో సరికొత్త ఎపిసోడ్ జోడించారని, దాన్ని షూట్ చేయాల్సి ఉందని, అందుకోసం చిరు కాల్షీట్లు కూడా కావాలని వార్తలొచ్చాయి. దాంతో ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుందనుకొన్నారు. అయితే ఇప్పుడు చిత్రబృందం ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ దసరాకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమాని విడుదల చేయాలన్న ధ్యేయంగా పెట్టుకొన్నార్ట.
అక్టోబరు 16న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకొంటున్నారు. దసరా సీజన్, అందులోనూ విశ్వంభర ఫ్యామిలీ, చిన్న పిల్లలకు నచ్చే కథాంశంతో రూపొందింది. కాబట్టి అడ్వాంటేజ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. సరిగ్గా ఇదే సీజన్లో రజనీకాంత్ 'జైలర్ 2' కూడా వస్తోంది. ఈ రెండు సినిమాలూ ఒక రోజు వ్యవధిలో విడుదల కాబోతున్నాయి. ఓవైపు మెగాస్టార్, మరోవైపు సూపర్ స్టార్ సినిమాలు. అభిమానులకు ఇంతకంటే కావాల్సిందేముంది? ఈ దసరా సీజన్లో మరికొన్ని తెలుగు సినిమాలు కూడా క్యూ కట్టబోతున్నాయి. ఎలా చూసినా..ఈ దసరాకు తెలుగు సినిమాకు 'సంక్రాంతి' ఎఫెక్ట్ కనిపించడం ఖాయం అనిపిస్తోంది.

