పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది.
. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ తమ కాన్వాయ్లను తగ్గించుకుని దేశ ఆర్థిక భద్రతే పరమావధిగా అడుగులు వేస్తున్నారు. నేడు జరిగిన కేబినెట్ సమావేశం ఇందుకు వేదికగా నిలిచింది.
ముఖ్యమంత్రి ఆదర్శం - కాన్వాయ్లో కోత
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అధికారిక కాన్వాయ్ను 50 శాతం మేర కుదించుకున్నారు. గతంలో సుమారు 10కి పైగా వాహనాలతో వెళ్లే ముఖ్యమంత్రి, నేడు కేవలం 4 వాహనాలతోనే సచివాలయానికి చేరుకున్నారు. తన భద్రతా సిబ్బంది ఇబ్బంది పడకుండా ఉండటానికి, వారి కోసం ప్రత్యేకంగా ఒక బస్సును ఏర్పాటు చేళారు.
డిప్యూటీ సీఎం , మంత్రులు కూడా
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్ను 4 వాహనాలకు పరిమితం చేసుకోవాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. మంత్రి నాదెండ్ల మనోహర్ కేవలం 3 వాహనాల కాన్వాయ్తో సచివాలయానికి వెళ్లగా, మంత్రులు అచ్చెన్నాయుడు , మరి కొంత మంది వెళ్లి కేవలం ఒక్కో వాహనంలోనే కేబినెట్ భేటీకి హాజరయ్యారు.
లోకేశ్ వినూత్న నిర్ణయం
మంత్రి నారా లోకేశ్ తన కాన్వాయ్ను సగానికి కుదించి, కేవలం రెండు వాహనాలకే పరిమితం చేశారు. భద్రతా ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిన ఇతర సిబ్బంది కోసం ఆయన కూడా ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ఇది భద్రతను నిర్లక్ష్యం చేయకుండానే పొదుపును ఎలా పాటించవచ్చో తెలియజేస్తోంది. అంతేకాకుండా, మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, పయ్యావుల కేశవ్ వంటి వారు ఎస్కార్ట్ వాహనాలు లేకుండా సింగిల్ వాహనాల్లోనే సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
అంతర్జాతీయ పరిస్థితుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఇంధన దిగుమతులపై ఒత్తిడి పెరుగుతోందని చంద్రబాబు గుర్తుచేశారు. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పెట్రోల్, డీజిల్ పొదుపు చేయాలని పిలుపునిచ్చారు. కేవలం ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా, ప్రజలందరూ ఈ పొదుపు యజ్ఞంలో భాగస్వాములు కావాలని కోరారు.

