జనసేన పార్టీ, పవన్ కల్యాణ్, అమిత్ షాలను ఇబ్బందిపెట్టేలా నాగేశ్వర్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కోరగా..
దానికి అమిత్ షా స్పందిస్తూ చంద్రబాబు మాకు ఇన్స్టంట్ మిత్రుడు కావచ్చు, కానీ జగన్ మాకు పర్మినెంట్ ఫ్రెండ్ అని అన్నట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక స్టోరీని తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారాన్ని జనసేన పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా స్పందించారు. నాగేశ్వర్ అంటే మాకు గౌరవం ఉంది. నేను స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. కానీ, ఆయన ఇంత అడ్డగోలుగా, అవాస్తవాలను ఎలా ప్రచారం చేస్తారు అని ప్రశ్నించారు. జనసేన సోషల్ మీడియా రోజంతా నాగేశ్వర్ ను టార్గెట్ చేస్తూనే ఉంది. అమిత్ షా అలా అన్నారని నాగేశ్వర్కు ఎవరు చెప్పారో 24 గంటల్లోగా బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆధారాలు చూపించలేకపోతే, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తక్షణమే క్షమాపణ చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు.
ఈ వివాదం వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ కోటరీ ఉందనే అనుమానాలను జనసేన శ్రేణులు గట్టిగా వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అత్యంత బలంగా దూసుకుపోతుండటాన్ని జీర్ణించుకోలేక, వారి మధ్య అపనమ్మకాన్ని సృష్టించేందుకే ఈ ఫేక్ స్టోరీ ని ప్లాన్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ను ఒక వైపు, చంద్రబాబును మరో వైపు వేరు చేసి చూపించడం ద్వారా టీడీపీ క్యాడర్లో అనుమానాల బీజాలు నాటాలనేదే తాడేపల్లి వ్యూహమని, దానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక పావులా వాడుకపడ్డారని సోషల్ మీడియాలో జనసైనికులు ట్రోల్స్తో విరుచుకుపడుతున్నారు.

