తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా మూడో దశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని తాజాగా ప్రకటించింది.
దీని వల్ల ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారు.
ఈ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను స్వయంగా వెరిఫై చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జూలై 14 వరకు, తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఈ ఇంటింటి సర్వే కొనసాగుతుంది. ప్రస్తుతం ఏపీలో 4.16 కోట్ల మంది, తెలంగాణలో 3.39 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఓటర్లు తమ పేరు, చిరునామా, వయస్సు వంటి వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఈ సమయంలో సరిచేసుకోవచ్చు. మరణించిన వారి పేర్లు తొలగించడం, కొత్తగా 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అనంతరం ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 22న, తెలంగాణలో అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాలను విడుదల చేస్తారు.
ఈ బృహత్తర కార్యక్రమం కోసం వేలాది మంది బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లను ఎన్నికల సంఘం రంగంలోకి దించుతోంది. పారదర్శకత కోసం రాజకీయ పార్టీలు కూడా తమ ప్రతినిధులను నియమించుకోవాలని సూచించింది. పౌరులు తమ ఓటు హక్కును భద్రపరుచుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

