ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేవలం ఒక పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు, అది భారతదేశపు సరికొత్త డీప్-టెక్ హబ్గా అవతరిస్తోందని ప్రముఖ జాతీయ దినపత్రిక ది ఎకనామిక్స్ టైమ్స్ ప్రత్యేక కథనం ప్రచురించింది.
ఇంకా పూర్తిస్థాయి భవన నిర్మాణాలు జరగకముందే, అమరావతిలోని క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను, స్టార్టప్లను , సరికొత్త కలలు కనే యువతను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. ఈ అద్భుత ప్రస్థానంపై ఏపీ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ దికగా స్పందిస్తూ చేసిన భావోద్వేగ ట్వీట్ వైరల్ అవుతోంది.
గుంటూరు ఆటోడ్రైవర్ కుమార్తె ఇప్పుడు క్వాంటమ్ ఇంజినీరింగ్
గుంటూరుకు చెందిన ఒక సాధారణ ఆటో రిక్షా కార్మికుడి కుమార్తె అయిన పల్లవి, పదో తరగతిలో 600కి 600 మార్కులు సాధించి, ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. నేడు ఆమె అమరావతి క్వాంటం వ్యాలీలోని ఒక ప్రముఖ డీప్-టెక్ కంపెనీలో డిజిటల్ డిజైన్ ఇంజనీర్గా దేశ భవిష్యత్తును మారుస్తోంది. గోపాల్ జోషి ముంబైలోని ప్రతిష్టాత్మక భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో 38 ఏళ్ల పాటు సేవలు అందించి రిటైర్ అయిన 61 ఏళ్ల సీనియర్ శాస్త్రవేత్త. అమరావతి క్వాంటం వ్యాలీ సృష్టించిన సరికొత్త అవకాశాన్ని చూసి, ఆయన ముంబై వదిలి ఇక్కడి క్వాంటం ఆపరేషన్స్లో భాగస్వామి అయ్యారు. నాగలక్ష్మయ్య దేశంలోని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లలో సుదీర్ఘ పరిశోధనలు చేసిన ఈయన, ప్రస్తుతం అమరావతి వేదికగా అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థల నిర్మాణంలో నిమగ్నమయ్యారు.
ఈ ఎకోసిస్టమ్ కోసమే ప్రయత్నం
ఈ కథనంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. పల్లవి కాయల, గోపాల్ జోషి, నాగలక్ష్మయ్య.. వీరు కేవలం వార్తాపత్రికలో వచ్చిన పేర్లు కాదు. మా విజన్ను నమ్మి, అమరావతి వేదికగా భారతదేశపు క్వాంటం భవిష్యత్తును నిర్మిస్తున్న యువ భారత కిరణాలు. నగరం ఇంకా పూర్తిగా నిర్మించబడక ముందే ప్రపంచ స్థాయి మేధావులను, శాస్త్రవేత్తలను అమరావతి ఆకర్షిస్తోందంటే.. మా నమ్మకం, ఆశయం ఎంత బలంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఇలాంటి సక్సెస్ స్టోరీల కోసమే మేము ప్రాణం పెడుతున్నాం అంటూ లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీని అంతర్జాతీయ డీప్-టెక్ హబ్గా మార్చాలనే తమ సంకల్పాన్ని అద్భుతంగా చిత్రీకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
భవిష్యత్లో క్వాంటమ్ విప్లవం
గతంలో హైదరాబాద్ను ఐటీ పవర్హౌస్గా మార్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు తగ్గట్టుగా, అమరావతి ఇప్పుడు క్వాంటం విప్లవానికి కేంద్రబిందువుగా మారుతోంది. కేవలం కాంక్రీట్ భవనాలు కట్టడం కంటే ముందే, ఇక్కడ సరికొత్త ఎకో-సిస్టమ్, మేధోసంపత్తి సిద్ధమవ్వడం ఏపీ భవిష్యత్తుకు శుభసూచకం. ఒకవైపు పేద కుటుంబాల నుంచి వచ్చిన పల్లవి లాంటి ప్రతిభావంతులు, మరోవైపు దేశంలోని అత్యున్నత సంస్థల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు కలిసి అమరావతి గడ్డపై సృష్టిస్తున్న ఈ క్వాంటం విప్లవం రాబోయే 50 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ వృద్ధికి బలమైన ఇంజిన్గా మారబోతోందని టెక్ నిపుణుల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది.

