పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతి పరిణామాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రేగిన అంతర్గత సంక్షోభం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. పార్టీకి చెందిన దాదాపు రూ.
440 కోట్ల నిధులు ఉన్న మూడు ప్రధాన బ్యాంక్ ఖాతాల లావాదేవీలపై సైబర్ క్రైమ్ పోలీసులు డెబిట్ ఫ్రీజ్ విధించడం పెను సంచలనంగా మారింది.రెబెల్ ఎమ్మెల్యేల ఫిర్యాదుల ఆధారంగా ఒక ప్రైవేట్ రంగ బ్యాంక్ లోని ఈ అకౌంట్ల నుంచి ఎలాంటి విత్డ్రాయల్స్ లేదా బయటకు వెళ్లే లావాదేవీలు జరగకుండా నిలిపివేశారు. అయితే, ఈ ఖాతాల్లోకి ఇతర నిధులు జమ కావడానికి మాత్రం సాంకేతికంగా ఎలాంటి అభ్యంతరం లేదు.
నిధుల మూలాలపై రెబెల్స్ ఫిర్యాదు.. దర్యాప్తుకు డిమాండ్!
ఇటీవలి ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో మమతా బెనర్జీ వర్గానికి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబెల్ గ్రూపునకు మధ్య పార్టీ ఆర్థిక మూలాలు, అధికార పగ్గాల కోసం తీవ్రమైన పోరాటం నడుస్తోంది. ఈ క్రమంలోనే రితబ్రత బెనర్జీ వర్గానికి చెందిన 10 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బిధానగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. పార్టీ ఖాతాల్లో ఉన్న ఈ వందల కోట్ల నిధులు చట్టబద్ధమైన మార్గాల ద్వారా వచ్చినవి కావని.. అక్రమ వసూళ్లు , ప్రభుత్వ నిధుల మళ్లింపు, వివిధ స్కామ్ల ద్వారా వచ్చిన సొమ్మును డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ఈ అకౌంట్లకు చేర్చారనే బలమైన అనుమానాలు ఉన్నాయంటూ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ ట్రెజరర్ లేఖతో మొదలైన లొల్లి..
ఈ ఆర్థిక యుద్ధం కొన్ని రోజుల క్రితమే ఒక మలుపు తిరిగింది. పార్టీ మాజీ ట్రెజరర్, మాజీ మంత్రి అరూప్ బిస్వాస్.. పార్టీలో నాయకత్వ వివాదం నడుస్తోందని, నిధుల భద్రత దృష్ట్యా ఈ అకౌంట్ల లావాదేవీలను నిలిపివేయాలని బ్యాంకుకు లేఖ రాశారు. దీనిపై మమతా బెనర్జీ లాయలిస్ట్, ఎమ్మెల్యే కునాల్ ఘోష్ తీవ్రంగా స్పందించారు. జూన్ 5న జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలోనే అరూప్ బిస్వాస్ను ట్రెజరర్ పదవి నుంచి తొలగించి, సుభాశిష్ చక్రవర్తిని నూతన ట్రెజరర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని స్పష్టం చేశారు. పదవిలోనే లేని అరూప్ బిస్వాస్ పార్టీ ఆర్థిక విషయాలపై మాట్లాడటానికి లేదా బ్యాంకులకు లేఖలు రాయడానికి ఎలాంటి అర్హత లేదని కునాల్ ఘోష్ కొట్టిపారేశారు.
ఢిల్లీకి చేరిన 'అసలు టీఎంసీ' పంచాయితీ!
మరోవైపు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో దాదాపు 65 మంది తనవైపే ఉన్నారని రితబ్రత బెనర్జీ క్లెయిమ్ చేస్తుండటం దీదీ వర్గానికి మింగుడుపడటం లేదు. అటు లోక్సభలోనూ 28 మంది టీఎంసీ ఎంపీలలో 20 మంది రెబెల్స్ ఇప్పటికే నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) లో విలీనమై, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించారు. అసలు తృణమూల్ కాంగ్రెస్ ఎవరిది అనే పంచాయితీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వద్దకు చేరింది. తిరుగుబాటు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని అభిషేక్ బెనర్జీ నేతృత్వంలోని బృందం స్పీకర్ను కోరగా.. ఇప్పుడు బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ల పర్వంతో ఈ అంతర్గత యుద్ధం మరింత ముదిరి రోడ్డున పడింది.

