సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ ఈరోజు కోర్టు విచారణకు వర్చువల్గా హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టు ముందు హాజరయ్యారు.
అయితే తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 1కి వాయిదా వేశారు.
ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కేసు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. 'పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడటం ఈ కేసుకు కేంద్రబిందువుగా మారింది. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్పై కూడా కేసు నమోదైంది.
ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయడం, అనంతరం బెయిల్పై విడుదల కావడం తెలిసిందే. ఆ తర్వాత కూడా కేసుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కోర్టు విచారణలకు ఆయన హాజరవుతున్నారు.
తాజా విచారణలో అల్లు అర్జున్ స్వయంగా కోర్టుకు వెళ్లకుండా వర్చువల్ విధానంలో హాజరు కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే సెప్టెంబర్ 1న జరిగే తదుపరి విచారణకు ఆయన ఇదే విధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారా? లేక నేరుగా కోర్టుకు వచ్చి ఫిజికల్గా హాజరవుతారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. దీనిపై కోర్టు నిర్ణయంతోనే పూర్తి క్లారిటీ రానుంది. బన్నీ ఈసారి కూడా వర్చువల్ గానే హాజరు అయ్యేలా అనుమతి ఇవ్వాలని, బన్నీ తరపున న్యాయవాది మరోసారి పిటీషన్ వేయనున్నారు. దానిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో చూడాలి. ఒకవేళ స్వయంగా కోర్టుకు రావాలని ఆదేశిస్తే మాత్రం ఈసారి బన్నీ కోర్టు మెట్లు ఎక్కక తప్పదు. కానీ.. ఆయన్ని వర్చువల్ గానే విచారించే ఛాన్స్ ఉందని సన్నిహితులు చెబుతున్నారు.

