తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలతో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు ఈ సుదీర్ఘ భేటీ సాగనుంది.
రాబోయే రోజుల్లో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఓటర్ల వెరిఫికేషన్ సమయంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు గ్రౌండ్ లెవల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై చంద్రబాబు క్లాస్ తీసుకోనున్నారు. ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బూత్ లెవల్ ఏజెంట్లు చురుగ్గా పనిచేసేలా చూడాలని ఎమ్మెల్యేలకు స్పష్టమైన సూచనలు చేయనున్నారు.
ఎన్నికల వేళ ఓటర్ల జాబితాలో జరిగే మార్పులు చేర్పులు ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఓటర్ల జాబితాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఎవరి ఓట్లు ఉంచాలి, వేటిని తొలగించాలనే కోణంలో వైసీపీ క్యాడర్ నిశ్శబ్దంగా గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ప్రతిపక్షం మైండ్ గేమ్కు కౌంటర్ ఇచ్చేలా కూటమి ఎమ్మెల్యేలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధినేత హెచ్చరించనున్నారు.
SIR ప్రక్రియను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని, ఇది భవిష్యత్ రాజకీయాలకు అత్యంత కీలకమైన ఘట్టమని చంద్రబాబు నేతలకు తేల్చి చెప్పనున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో దొంగ ఓట్లను ఏరివేయడం, వలస వెళ్లిన వారి వివరాలను సరిచూసుకోవడం వంటి అంశాలపై ప్రతి ఎమ్మెల్యే తన పరిధిలో పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించనున్నారు. అధికారంలో ఉన్నామని లైట్ తీసుకుంటే ప్రతిపక్షం దెబ్బకొట్టే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నడుమ సుదీర్ఘ భేటీ తీవ్ర రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

