తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత పారదర్శకంగా మార్చడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వనరులను బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం, జూన్ 5వ తేదీ నుంచి కొత్త ధరలను అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లోని ధరలకు మధ్య ఉన్న భారీ వ్యూహాత్మక హెచ్చుతగ్గులను అరికట్టడమే లక్ష్యంగా ఈ క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకున్నారు.
నిపుణుల నివేదిక ఆధారంగా హేతుబద్ధీకరణ
రాష్ట్రంలో భూముల విలువలను కేవలం రెవెన్యూ అవసరాల కోసమే కాకుండా, పూర్తి ఆర్థిక సమగ్రతతో సవరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా, ప్రముఖ ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదికను , ఉన్నతాధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ విస్తృత అధ్యయనం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఒకలా, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మరోలా ధరలను శాస్త్రీయంగా వర్గీకరించడం ద్వారా ఇటు ప్రజలకు భారం పడకుండా, అటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా హేతుబద్ధీకరణ చేశారు.
ధరల నిర్ణయంలో కీలకమైన 'గ్రోత్ కారిడార్లు'
కొత్త విలువల నిర్ణయంలో కేవలం పాత రికార్డులను తిరగేయకుండా.. క్షేత్రస్థాయి మౌలిక వసతుల విస్తరణను ప్రామాణికంగా తీసుకున్నారు. వివిధ ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యం, వృద్ధి రేటు, ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన భూముల వేలాలు, మార్కెట్ పరిస్థితులతో పాటు కొత్త రహదారులు, ఔటర్ రింగ్ రోడ్ , ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్ రోడ్ , పారిశ్రామికాభివృద్ధి కారిడార్లను బేస్ చేసుకుని రేట్లను ఫిక్స్ చేశారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్లుగా మారిన ప్రాంతాల్లో ప్రభుత్వ విలువలు వాస్తవ మార్కెట్ ధరలకు ఇంచుమించుగా చేరువ కానున్నాయి.
పట్టణీకరణకు తగ్గట్లుగా నిర్మాణాల రేట్ల సవరణ
తెలంగాణలో గత కొన్ని ఏళ్లలో పెద్ద ఎత్తున భౌగోళిక మార్పులు సంభవించాయి. అనేక మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ కాగా.. వందలాది గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. ఈ పట్టణీకరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఆర్సీసీ , నాన్-ఆర్సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పునఃసమీక్షించారు. భవన నిర్మాణాల విలువను కూడా ప్రాంతాన్ని బట్టి రీ-డిజైన్ చేయడం వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో తలెత్తే సాంకేతిక వ్యత్యాసాలకు తెరపడనుంది.
లావాదేవీల్లో పారదర్శకత
ప్రభుత్వం చేపట్టిన ఈ సవరణల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పారదర్శకతకు పెద్దపీట వేసినట్లయింది. మార్కెట్ విలువలు పెరగడం వల్ల ఓపెన్ మార్కెట్లో బ్లాక్ మనీ ప్రవాహం తగ్గి, బ్యాంక్ లోన్లు సులభంగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ఖజానాకు రిజిస్ట్రేషన్ల రూపంలో అదనపు ఆదాయం సమకూరి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరిన్ని మౌలిక వసతుల కల్పనకు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.

