జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగానే తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో పవన్ కల్యాణ్ సుదీర్ఘ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జూన్ రెండో తేదీన ఈ సమావేశం జరగనుంది.
ఇటీవల జరిగిన పరిణామాలతో తెలంగాణలో జనసేన ఉనికిని బలగా చాటుకునేందుకు ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో సాధించిన అఖండ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, తెలంగాణలోనూ పార్టీని ఒక బలమైన శక్తిగా మార్చాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఈ భేటీలో ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ ప్రస్తుత పరిస్థితి, కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
తెలంగాణలో పార్టీని కేవలం ఎన్నికల సమయానికే పరిమితం చేయకుండా, ప్రజల పక్షాన నిలబడేలా నిరంతర కార్యాచరణను ఖరారు చేయబోతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయడం, ప్రజా క్షేత్రంలో జనసేన సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, సభల నిర్వహణకు సంబంధించిన రూట్ మ్యాప్ను కూడా ఈ సమావేశంలో సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ జనసేన నాయకులు కూడా పార్టీ అధినేతతో భేటీ కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి కార్యాచరణతో ముందుకు వెళ్తామని, తెలంగాణలో జనసేన జెండాను బలంగా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సుదీర్ఘ సమావేశం అనంతరం తెలంగాణలో జనసేన పార్టీ చేపట్టబోయే తదుపరి రాజకీయ వ్యూహాలు, అధికారిక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

