తెలంగాణలో జనసేన యాక్టివ్ అయింది. నాగేశ్వర్ బ్యాచ్ చేసిన అతి.. ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీకి ఊహించని పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెట్టింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా నాగేశ్వర్కు మద్దతు తెలిపే పేరుతో సదరు బ్యాచ్ పవన్ కళ్యాణ్పై ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత దూషణలు, బూతుల పురాణం అందుకోవడంపై తెలంగాణ జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాయి.
పవన్ను టార్గెట్ చేయడం ద్వారా పొరుగు రాష్ట్ర పార్టీగా ముద్ర వేయాలని చూసిన వారి తిప్పికొడుతూ.. తెలంగాణ జనసేన లీడర్లు సైతం అదే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా తీవ్ర హెచ్చరికలతో విరుచుకుపడ్డారు.
ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన జనసేన ప్రతినిధులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అండతో రెచ్చిపోయిన ప్రతి ఒక్కరికీ జనసేన నేతలు క్లియర్ కట్ ఆధారాలతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్ ఎటాక్లో జనసేన తెలంగాణ కీలక నేత, ప్రముఖ నటుడు ఆర్కే సాగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్ నిబద్ధతను, ఆయన కష్టాన్ని ప్రశ్నించే అర్హత ఈ నేతలకు లేదన్నారు. విషయం లేని పిట్టకథలు చెప్పి దొరికిపోయాక, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ సెంటిమెంట్ను, విద్వేషాలను రగిలిస్తామంటే చూస్తూ ఊరుకోం అంటూ జనసేన లీడర్లు చేసిన సవాళ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజానికి, ఇన్నాళ్లూ తెలంగాణలో జనసేన ఉనికి కేవలం సోషల్ మీడియాకే పరిమితమైంది. ఈ తాజా ప్రెస్ క్లబ్ వివాదం తో క్షేత్రస్థాయిలో ఉన్న జనసైనికులు, నాయకులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి తమ పవర్ ఏంటో చూపించారు. పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా తిట్టడం ద్వారా జనసేనను డిఫెన్స్లో పడేయాలనుకున్న నాగేశ్వర్ కోటరీ ప్లాన్ పూర్తిగా రివర్స్ కొట్టి.. టీ-జనసేనకు ఒక సరికొత్త బూస్టింగ్ ఇచ్చినట్లయింది. ఆర్కే సాగర్ వంటి గ్లామర్, సబ్జెక్ట్ ఉన్న లీడర్లు ప్రెస్ మీట్లలో దూకుడు ప్రదర్శించడంతో.. పార్టీ అధిష్టానం కూడా తెలంగాణ వింగ్కు మరింత ప్రాధాన్యం ఇచ్చే చాన్స్ ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు, ఇతర మున్సిపల్ పోరులో కూటమి తరపున సీట్లు సాధించుకునేందుకు ఈ ఊపు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్పై జరిగిన ఈ అటాక్ను ఒక అవకాశంగా మార్చుకుని, తెలంగాణ గడ్డపై జనసేన జెండాను మరింత బలంగా పాతడానికి.. ఇకపై సరికొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు జనసేన శ్రేణులకు మంచి అవకాశం లభించింది.

