కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ బృందాలు.. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం ప్రధాన నివాసంపై దాడి చేశాయి.
ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో అధికారుల బృందాలు ఉదయం 6 గంటల నుంచే ఏకకాలంలో మొత్తం ఐదు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలను ప్రారంభించాయి. తిరుమలలో ఉన్న లోకనాథం కార్యాలయంతో పాటు తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల నివాసాలు, ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు ఒకేసారి సోదాలు నిర్వహించారు. తిరుమల క్షేత్ర స్థాయిలో కీలక పదవిలో ఉంటూ అక్రమార్జనకు పాల్పడ్డారని ఏసీబీకి పక్కా సమాచారం అందింది.
సోదాల్లో పలు కీలక ఆస్తుల పత్రాలు, నగదు, బ్యాంక్ లాకర్లు, బాండ్లు , వివిధ రంగాల్లో పెట్టిన అక్రమ పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లోకనాథం కుటుంబసభ్యులు, బంధువుల పేరిట ఉన్న బెనామీ ఆస్తులపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగంలో డిప్యూటీ ఈవో స్థాయి అధికారి ఇల్లు, ఆఫీసుపైనే ఈ స్థాయిలో దాడులు జరగడం టీటీడీ వర్గాల్లో కలకలం రేపింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల పవిత్రతను కాపాడటంతో పాటు టీటీడీలో అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేసింది. గతంలో శ్రీవారి ఆలయ విధుల్లో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై లోతుగా విచారణ జరిపిన పిదప అధికారులు ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోదాలు ముమ్మరంగా కొనసాగుతుండగా, లభ్యమైన మొత్తం ఆస్తుల విలువ, ల్యాండ్ డాక్యుమెంట్లు, డిపాజిట్ల వివరాలపై సాయంత్రానికి ఏసీబీ అధికారులు పూర్తి స్పష్టతతో కూడిన ప్రకటన విడుదల చేసే అవకాశముంది. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ వంద కోట్ల వరకూ ఉండవచ్చని భావిస్తున్నారు.

