తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన బండి భగీరథ్ కేసు వివాదం సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్కు చేరింది. ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవీ దేవిపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాన్ని అల్లి, మొదటి పోస్ట్ పెట్టిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరిపేటకు చెందిన రాయసం దామోదర్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నెల్లూరులో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త దామోదర్
పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. అరెస్ట్ అయిన దామోదర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్లో సుదీర్ఘకాలంగా తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్న కీలక సూత్రధారి. ఇతడు పక్కా ప్రణాళికతో ఫేక్ అకౌంట్లను సృష్టించి ప్రత్యర్థులపై బురదజల్లే ఒక స్లీపర్ సెల్ తరహా వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు. పోక్సో కేసులో భగీరథ్ను కాపాడేందుకు, న్యాయమూర్తి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఆశ జూపి మేనేజ్ చేస్తున్నారంటూ పూర్తిగా కల్పితమైన కథనాన్ని ఈ దామోదరే ముందుగా సృష్టించి వైరల్ చేసినట్లు ఐపీ అడ్రస్ ఆధారంగా సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు.
వైసీపీ సానుభూతిపరుడికి ఈ అవసరం ఏమిటి?
అయితే, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక వైసీపీ సానుభూతిపరుడికి తెలంగాణ రాజకీయాలతో, అదీ ఒక హైకోర్టు న్యాయమూర్తిపై అభాండాలు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేదే ఇప్పుడు అసలైన ఆసక్తికరమైన ప్రశ్న. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆ తప్పుడు పోస్టుల ఆధారంగా అత్యంత అగ్రెసివ్ గా స్పందించడం, సోషల్ మీడియాలో దాన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వైసీపీ సోషల్ మీడియా సైన్యానికి తెలంగాణలో ఏం పని అనే కోణంలో విశ్లేషిస్తే.. తెరవెనుక బీఆర్ఎస్, వైసీపీ సోషల్ మీడియా విభాగాలు వేర్వేరు కావని, అవెండూ ఉమ్మడి వ్యూహంతో పనిచేస్తున్నాయనే అనుమానాలకు ఈ ఘటన బలమైన నిరూపణగా నిలుస్తోంది. లోకల్గా మాత్రమే కాకుండా విదేశాల్లో ఉన్న వీరి ఎన్నారై విభాగాల టీమ్లు కూడా ఉమ్మడి అజెండాతోనే ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నాయని అనుకోవచ్చు.
న్యాయవ్యవస్థపై పదే పదే వైసీపీ దాడి
గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులను టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ చేసిన వ్యవస్థాగత దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. నాటి వ్యవహారంలో సీబీఐ రంగంలోకి దిగి పలువురిని అరెస్ట్ కూడా చేసింది. ఇప్పుడు అదే వ్యూహాన్ని, అదే తరహా భాష్యాలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై కూడా ప్రయోగించారు. పోలీసులు సీరియస్గా దృష్టి సారిస్తే . ఈ ఫేక్ న్యూస్ తయారీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఏపీ నుంచి తెలంగాణ వరకు నడుస్తున్న ఈ ఉమ్మడి సోషల్ మీడియా మాఫియా నెట్వర్క్ లింకులు ఏమిటనే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

