వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతాన్ని ఉద్దేశించి తెరపైకి తెచ్చిన మావిగన్ ప్రతిపాదనను సమర్థించడానికి సదరు పార్టీ సోషల్ మీడియా పేటీఎం ఎకోసిస్టమ్తో పాటు కొందరు మేధావుల ముసుగులో ఉన్న విశ్లేషకులు పడుతున్న పాట్లు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి.
జగన్ రెడ్డి ఏది చెబితే దానికి గుడ్డిగా భజన చేసే ఈ నెట్వర్క్, తాజా ప్రతిపాదనను సమర్థించే క్రమంలో తమ కనీస మేధావితనాన్ని సైతం ఫ్రిజ్లో పెట్టేసి బయటకు వచ్చారు. చివరికి తనను పేటీఎం అనవద్దని బతిమాలుకునే నాగేశ్వర్ లాంటి వారు సైతం ఈ మావిగన్' ఐడియాను సమర్థిస్తూ వరుస వీడియోలు రిలీజ్ చేయడం చూస్తుంటే.. ఈ ఎకోసిస్టమ్ ఏ స్థాయి వ్యూహాత్మక ప్రచారంలో మునిగిపోయిందో అర్థమవుతోంది.
అసలు మావిగన్ గ్రోత్ కారిడార్ అంటే ఎవరికైనా తెలుసా?
వాస్తవానికి, జగన్ రెడ్డి చెప్పిన ఈ మావిగన్ ఐడియాలో ఒక నేషనల్ హైవే పేరు, దానికి ఇరువైపులా ఉన్న కొన్ని పట్టణాల అక్షరాలను కలపడం తప్ప.. అసలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఒక్కటంటే ఒక్క పక్కా ప్రణాళిక గానీ, విజన్ గానీ లేదు. అందులో ఈ మేధావులకు ఏ అద్భుతం కనిపించిందో వారి అడ్డగోలు లాజిక్కులకే తెలియాలి. ఎందుకంటే, వీరంతా గతంలో అమరావతిని నాశనం చేయడానికి జగన్ తెచ్చిన మూడు రాజధానుల తుగ్లక్ కాన్సెప్ట్ను కూడా ఇదే స్థాయిలో నెత్తిన పెట్టుకుని సమర్థించిన చరిత్ర ఉన్నవారే. అధికారంలో ఉండి, ప్రపంచ స్థాయి నగర ప్రణాళికగా అంతర్జాతీయ గుర్తింపు పొంది, శరవేగంగా పట్టాలెక్కిన అమరావతి ప్రాజెక్టును కేవలం రాజకీయ కక్షతో ధ్వంసం చేస్తుంటే.. నాడు వీరంతా మౌనంగా ఉండటమే కాకుండా ఆ వినాశనాన్ని ప్రగతిశీల నిర్ణయంగా రంగులు పూశారు.
మూడు రాజధానుల పేరుతో జరిగిన విధ్వంసానికీ ఇదే తరహాలో మద్దతు
ఒక రాజధాని నగరం అనేది కేవలం కొన్ని భవనాల సముదాయం కాదు, అది రాబోయే తరాల భవిష్యత్తుకు, ఉపాధికి ఒక గ్యారెంటీ. నాడు మూడు రాజధానుల పేరిట ఐదేళ్ల పాటు ఏపీ కాలయాపన చేయడం వల్ల ఒక పూర్తి తరం ఘోరంగా నష్టపోయింది. రాష్ట్రానికి రావాల్సిన లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఐటీ ఉద్యోగాలు పక్క రాష్ట్రాలకు తరలిపోయినా.. ఈ ఎకోసిస్టమ్ మేధావులు నోరు మెదపలేదు. ఇప్పుడు కాలం కలిసి రాక, కోర్టుల తీర్పులు అనుకూలించక.. ఆ మూడు రాజధానుల కాన్సెప్ట్ను అటకెక్కించి, కొత్తగా మావిగన్ అంటూ జగన్ రెడ్డి మాట మార్చగానే.. వీరంతా పాత మాటలను మర్చిపోయి మళ్లీ ప్లేట్ ఫిరాయించారు. అసలు నాడు మూడు రాజధానులు ఎందుకు కరెక్టో.. నేడు ఈ మావిగన్ ఎందుకు కరెక్టో ఈ మేధావులే సమాధానం చెప్పాలి.
జగన్ రెడ్డి చిల్లర కోసం భావితరాలకు చేటు చేస్తారా?
జగన్ రెడ్డి విదిల్చే లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం కక్కుర్తి పడి ఒక తరం భవిష్యత్తును బలిపెట్టేలా మాట్లాడటం అనేది చిన్న తప్పు కాదు. సమాజానికి సరైన దిశానిర్దేశం చేసేంత పెద్దవాళ్లమని.. గౌరవనీయులమని చెప్పుకుంటే సరిపోదు.. ఇలా ఒక పార్టీ ఐటీ సెల్ లా మారి నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచారం చేయడం తీవ్రమైన నేరం. ఈ కక్కుర్తి రాజకీయం వల్ల ఒక రాష్ట్ర సార్వభౌమత్వం, ఆర్థిక వ్యవస్థ ఎంతగా దెబ్బతిన్నాయో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను తప్పుదోవ పట్టించి, ఒక తరం జీవితాలను నాశనం చేసిన ఈ మేధావులకు, ప్రచార కర్తలకు కాలమే తగిన బుద్ధి చెబుతుందని.. భవిష్యత్తులో ఈ చారిత్రక తప్పిదానికి వారికి జరగాల్సినా శాస్తి జరుగుతుంది.

