తమిళనాడులో నూతనంగా ఏర్పాటైన ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వ కేబినెట్ కూర్పుపై ప్రముఖ కథానాయకుడు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
చిత్ర పరిశ్రమ, సినిమాటోగ్రాఫ్ చట్టం వంటి అత్యంత కీలకమైన శాఖలను రాజ్మోహన్కు కేటాయించడం విశాల్ కు నచ్చలేదు. సంక్షోభంలో ఉన్న ఇండస్ట్రీ సమస్యలపై అవగాహన లేని వారికి ఈ బాధ్యతలు అప్పగించడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన నేరుగా ముఖ్యమంత్రి విజయ్కే ఒక బహిరంగ లేఖను సంధించారు.
విశాల్ చిత్ర పరిశ్రమను వేధిస్తున్న సమస్యలను ప్రస్తావిస్తూ.. గత 30 ఏళ్లుగా పరిశ్రమలో క్షేత్రస్థాయి నుంచి పనిచేస్తున్న మన సీఎం విజయ్కు ఇండస్ట్రీ కష్టాల గురించి పూర్తి అవగాహన ఉంది. కానీ, ఈ రంగానికి సంబంధించిన సాంకేతికత, నిర్మాతల బాధలపై పెద్దగా అనుభవం లేని వ్యక్తిని మంత్రిగా నియమించడం వల్ల మాలాంటి అసోసియేషన్లు, నిర్మాతలు మా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు అని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఎవరినీ తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని చెప్తూనే, గత 9 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని మూడు ప్రధాన డిమాండ్లను వెంటనే నెరవేర్చి పరిశ్రమకు ఊపిరి పోయాలని సీఎం విజయ్ను కోరారు.
విశాల్ ముఖ్యమంత్రి ముందు 3 ప్రధాన డిమాండ్లు ఉంచారు. థియేటర్ టికెట్ల అమ్మకాల కోసం ప్రభుత్వమే ఒక అధికారిక ఆన్లైన్ పోర్టల్ను తీసుకురావాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు, ప్రస్తుతం ఒక్కో టికెట్పై అదనంగా రూ. 30 వరకు సర్వీస్ ఛార్జీలు చెల్లిస్తూ నష్టపోతున్న సామాన్య ప్రేక్షకుడికి భారీ ఊరట లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఒకే దేశం - ఒకే పన్ను విధానం అమల్లో ఉన్నప్పటికీ, తమిళనాడులోనే సినిమా రంగానికి రెండు రకాల పన్నులు జీఎస్టీతో పాటు లోకల్ బాడీ టాక్స్ విధిస్తున్నారు. ఈ అదనపు భారాన్ని తక్షణమే రద్దు చేయాలి. చి ప్రస్తుతం చిన్న తరహా బడ్జెట్ సినిమాలకు ఇస్తున్న సబ్సిడీ మొత్తం చాలా తక్కువగా ఉంది. ప్రతి ఏటా ఈ సబ్సిడీ మొత్తాన్ని భారీగా పెంచి, ఆర్థికంగా నష్టపోతున్న చిన్న నిర్మాతలను, ప్రొడక్షన్ హౌస్లను ఆదుకోవాలని కోరారు.
తమిళ సినీ పరిశ్రమ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో ఇండస్ట్రీ మూలాల నుంచి వచ్చిన విజయ్ మాత్రమే తమకు న్యాయం చేయగలరని విశాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

